ఎల్బీనగర్, సెప్టెంబర్ 12 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రజల రక్షణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ గుప్తా తమ నిధుల నుంచి రూ. 7 కోట్లు కేటాయించారు. డీజీపీ కార్యాలయంలో ఆదివారం డీజీపీ మహేందర్రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీలు మల్లేశం కురుమ, దయానంద్ గుప్తా రూ. 7 కోట్ల నిధుల మంజూరు పత్రాన్ని అందజేశారు. అదే విధంగా.. ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న నిధుల నుంచి కూడా మరో రూ. 1 కోటి సీసీ కెమెరాల ఏర్పాటుకు వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు.
ఎల్బీనగర్ను సేఫ్ అండ్ స్మార్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం రూ. 7 కోట్ల నిధుల మంజూరు పత్రాన్ని డీజీపీకి అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను కట్టడి చేయవచ్చని తెలిపారు. దళిత, గిరిజన బస్తీల్లోనూ రూ. 2 కోట్లతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు నిధులు కేటాయించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు డీజీపీ మహేందర్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.