ఖైరతాబాద్, జూన్ 20 : ఖైరతాబాద్ డబుల్ బెడ్రూం గృహాలకు సంబంధించిన లబ్ధిదారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. శనివారం ఖైరతాబాద్ బడా గణేశ్ వద్ద ఓ కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంగా ఎమ్మెల్యే తన అనుచరులకు అక్రమంగా డబుల్ బెడ్రూం కేటాయింపుపై ప్రశ్నించేందుకు లబ్ధిదారులు ప్లకార్డులతో స్థానిక బీఆర్ఎస్ నాయకురాలు తాండ్ర మేఘనతో కలిసి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పీఏ, ఆయన అనుచరులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అంతేకాకుండా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని బీఆర్ఎస్ నాయకురాలు మేఘనతో పాటు లబ్ధిదారులను అరెస్టు చేసి.. ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇదిలా ఉండగా, లబ్ధిదారుల్లో ఒకరైన ప్రియ అనే మహిళ తన రెండు నెలల బాబు తీసుకొని బడా గణేశ్ చౌరస్తాకు వచ్చారు. దానంను నిలదీసేందుకు సిద్ధంగా ఉన్న పలువురులబ్ధిదారులను అప్పటికే పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించగా, అక్కడి చిన్న బాబును చేతిలో పట్టుకొని తనను దానం పీఏతో పాటు అనుచరులు ఘెరావ్ చేసి.. బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘మీకు ఇండ్లు రావు…ఎవరితో చెప్పుకొంటారో చెప్పుకోండి’ అంటూ.. భయపెట్టారని ఆమె వాపోయారు. కాగా, ఖైరతాబాద్ ఇందిరానగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం గృహాలలో నిజమైన పేద వర్గాలకు కాదని, తన అనుచరులైన ఆర్థికంగా బలంగా ఉన్న వారికి ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్రమంగా ఇండ్లు కేటాయించారని బీఆర్ఎస్ నాయకురాలు తాండ్ర మేఘన ఆరోపించారు. ప్రస్తుతం కేటాయించిన వారందరూ అనర్హులేనని, వారిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.