ఎమ్మెల్యే దానం నాగేందర్
బంజారాహిల్స్,మార్చి 26: బస్తీల్లో చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేస్తూ అరాచకానికి పాల్పడితే సహించేది లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. జూబ్లీహిల్స్ డివిజన్ పద్మాలయ అంబేద్కర్నగర్ బస్తీలో ఓ మహిళ ఇంటి నిర్మాణానికి అడ్డుగా ఉన్న చెట్లను కొట్టేశారంటూ బస్తీకి చెందిన నేత రాములుతో పాటు అయన కుటుంబ సభ్యు లు అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు, స్థలాన్ని కబ్జా చేస్తున్నారని రెవెన్యూ సిబ్బందికి ఫిర్యాదు చేయడం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ వ్యవహారం చిలికిచిలికి గాలివానగా మారడంతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా సత్తిరెడ్డి. వెంకటేశ్వర్రెడ్డి అనే వ్యక్తులపై బీర్ బాటిళ్లతో దాడి చేయడంతో తలలు పగిలాయి.దాంతో బస్తీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్, షేక్పేట మండల తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డితో కలిసి శనివారం బస్తీలో పర్యటించారు. బస్తీలో కలిసి మెలిసి ఉండాల్సిన వారి మధ్య చిచ్చుపెట్టేలా కొంతమంది ప్రవర్తిస్తున్నారని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించారు. బస్తీలో నివాసం ఉంటున్న రమాదేవి అనే మహిళకు పట్టా ఉందని, ఆమెకు న్యాయం చేయాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరగా తహసీల్దార్తో మాట్లాడి తగిన తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కేసు నమోదు చేసిన పోలీసులు
పద్మాలయ అంబేద్కర్నగర్ బస్తీలో రమాదేవి అనే మహిళతో పాటు సత్తిరెడ్డి. వెంకటేశ్వర్రెడ్డి, బుచ్చిరెడ్డి, భాగ్యలక్ష్మి అనే మహిళలపై దాడికి పాల్పడిన బస్తీ నేత రాములుతో పాటు ఆయన కొడుకులు పరమేశ్, జగదీష్, భార్య అంజమ్మతోపాటు కుటుంబ సభ్యులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.