బంజారాహిల్స్,మార్చి 24: రంజాన్ మాసంలో ప్రార్థనలకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఆనంద్నగర్ కాలనీలోని మసీదు వద్ద రూ.6లక్షల వ్యయంతో వేసిన బోర్వెల్ను ఎమ్మెల్యే దానం నాగేందర్ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. రంజాన్ మాసం ప్రారంభమైనందున మసీదులవద్ద ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో క్లీనింగ్ పనులు చేపట్టారన్నారు. దీంతో పాటు ఆయా ప్రాంతాల్లో మురుగు సమస్యలు లేకుండా జలమండలి అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, నీటి సమస్యలు తలెత్తకుండా చూస్తారన్నారు. అన్ని మతాలకు సంబంధించిన పండుగలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ పరిస్థితి లేదన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.