బంజారాహిల్స్,సెప్టెంబర్ 14: జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్లో పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హామీ ఇచ్చారు. గురువారం ఇందిరానగర్లో స్థానికుల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర నిర్వహించారు. ఎల్వీ ప్రసాద్ దవాఖాన వెనకాల రెండు వీధుల్లో వీధి దీపాలు సరిగా వెలగడం లేదని, రోడ్లు పాడయ్యాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరానగర్లో మురుగు సమస్యను తీర్చేందుకు ఇటీవల సుమారు రూ.50లక్షల వ్యయంతో సీవరేజీ పనులు పూర్తి చేశామన్నారు. ఆ పనులు పూర్తయిన ప్రాంతాల్లో వీడీసీసీ రోడ్లను వేశామన్నారు.
పెండింగ్లో ఉన్న రోడ్లను కూడా త్వరలోనే వేయిస్తామని హామీ ఇచ్చారు. బస్తీలోని శ్రీరామ వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. కొంతమంది వృద్ధులు ఎమ్మెల్యే దానం నాగేందర్ను కలిసి వృద్ధ్దాప్య పింఛన్లు ఇప్పించాలని కోరారు. త్వరలోనే అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. రేకుల ఇండ్లు కలిగి ఉన్న వారితో పాటు ఫస్ట్ ఫ్లోర్ ఉండి అదనపు అంతస్తు కట్టుకునేవారికి గృహలక్ష్మి పథకం కింద రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులకు తప్పకుండా ఇండ్లు ఇప్పించే బాధ్యత తనదేనన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బోజిరెడ్డి, సునీల్, శంకర్, కిరణ్ యాదవ్, రాజేష్, కార్తీక్, వినోద్, కిట్టు, దీప, జ్యోతి, శాంతి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.