బంజారాహిల్స్,జూన్ 9: పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా దేశంలోనే ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ సారథి సీఎం కేసీఆర్ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శుక్రవారం ‘ తెలంగాణ సంక్షేమ సంబరాలు ’ పేరుతో బంజారాహిల్స్ రోడ్ నెం 11లోని లేక్వ్యూ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గం పరిదిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, హిమాయత్నగర్, సోమాజిగూడ. ఖైరతాబాద్ డివిజన్లకు చెందిన సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఈ సమావేశంలో పాల్గొని తమకు కలుగుతున్న లాభాల గురించి వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు 60కి పైగా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. తల్లిదండ్రులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల వల్ల ఎంతో ఊరట లభిస్తోందన్నారు.వృద్ధాప్య పింఛన్ను రూ.2వేలకు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ వృద్ధులకు పెద్ద కొడుకులా ఆదుకుంటున్నారన్నారు. దళితబంధు పథకం కింద సాయం అందుకున్న వారి జీవితాలు మెరుగు పడుతున్నాయని, త్వరలోనే రెండోవిడత దళితబంధు అందిస్తామన్నారు. పేదరికంతో బాధపడుతూ తమ పిల్లలను చదివించలేకపోయే వారని అలాంటి వారికి గురుకుల పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేవారికి రూ.20లక్షలు అందిస్తున్నదని గుర్తు చేశారు.
ఒకవైపు ఎస్సీల కోసం దళితబంధు పథకాన్ని అమలు చేస్తూనే రెండోవైపున కులవృత్తులపై ఆధారపడే బీసీ కులాలకు చేయూత ఇచ్చేందుకు సరికొత్త పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించినట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. కులవృత్తులు చేసుకుంటున్న బీసీ కుటుంబాలన్నింటికీ రూ.1లక్ష చొప్పున సాయం అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాల లబ్ధ్దిదారులకు ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఖైరతాబాద్ మండల పరిధిలోని 42మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే దానం నాగేందర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ ప్రసన్న రాంమ్మూర్తి, కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, వెల్దండ వెంకటేశ్, వనం సంగీత, ఖైరతాబాద్ డీసీఎం మోహన్రెడ్డి, సర్కిల్-18 ఏంఓహెచ్ డా. ప్రవీణ, యూసీడీ విభాగం అధికారులు దామోదర్, బాలచంద్ర సృజన్,వివిధ డివిజన్ల బీఆర్ఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు.