మణికొండ, నవంబర్ 20: అభివృద్ధి, సంక్షేమం సుస్థిర పాలన అందించే సత్తా సీఎం కేసీఆర్కే ఉందని బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మణికొండ మున్సిపాలిటీలో రోడ్షో నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని నెమలీనగర్ నుంచి మొదలై గీతాంజలి స్కూల్, ఎల్ఐసీ కాలనీ, పుప్పాలగూడ పాత గ్రామం, అల్కాపూర్ చింతచెట్టు నుంచి నెక్నాంపూర్ పాత గ్రామం అల్కాపూర్ టౌన్షిప్ 100 ఫీట్ రోడ్లో రోడ్ షో నిర్వహించారు.
అనంతరం మణికొండలోని దిలీప్ సూపర్ మార్కెట్ నుంచి భాగ్యలక్ష్మి కాలనీ, పంచవటి కాలనీ, పోచమ్మ కాలనీ, అంజలి గార్డెన్, డైమండ్ హిల్స్, చిత్రపురి కాలనీలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల సమయంలో వచ్చే చుట్టపు తీరుగా వచ్చి సాధ్యం కాని హామీలను చెప్పి ప్రజలను మభ్యపెట్టడమే తప్ప ప్రజలకు వారు చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ బూటకపు మా టలు విని ప్రజలు మోసపోవద్దని తెలిపారు.
ఎన్నికల సమయంలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని రా బోయే తరాల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకే మీరంతా మద్దతు పలికి అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ప్రకాశ్గౌడ్ ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా నెక్నాంపూర్ గ్రామానికి చెందిన పలువురు మైనార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కార్యక్రమంలో మనికొండ మున్సిపల్ బీఆర్ఎస్ సమన్వాయకర్త తలారి మల్లేశ్ముదిరాజ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, పార్టీ అధ్యక్షులు శ్రీరాములు, మహిళా విభాగం అధ్యక్షురాలు రూపారెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షురాలు లక్ష్మిశ్రీ, మున్సిపాలిటీ మైనార్టీ విభాగం అధ్యులు బషీర్, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, ప్రత్యూష ఫౌండేషన్ చైర్ పర్సన్ సరోజిని, బీఆర్ఎస్ నాయకులు నీలేష్ప్రసాద్దూబే, బాల్రెడ్డి, లక్షోమయ్య, మహేశ్, శ్రీకాంత్, కుమార్, రవీందర్, శ్రావణ్కుమార్, దిలీప్ పాల్గొన్నారు.
మణికొండ, నవంబర్ 20: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పాటుపడే ఏకైక ప్రభుత్వం అని నార్సింగి మున్సిపల్ చైర్ పర్సన్ దార్గుపల్లి రేఖయాదగిరి అన్నారు. సోమవారం నార్సింగి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు గౌలిదొడ్డి వివేకానందనగర్లో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్కు మద్దతుగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
శంషాబాద్ రూరల్, నవంబర్ 20 : గ్రామాల అభివృద్ధి కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమని జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నీరటి తన్విరాజు, మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని కవ్వగూడలో సర్పంచ్ రమేశ్యాదవ్తో కలిసి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కోలన్ సుష్మారెడ్డి, 11వ వార్డు కౌన్సిలర్ లావణ్యశ్రీనివాస్గౌడ్ ప్రజలను కోరారు. సోమవారం శంషాబాద్ మున్సిపాలిటీలోని 11వ వార్డు తొండుపల్లి, కిషన్గూడలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
బండ్లగూడ, నవంబర్ 20 : సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని కార్పొరేటర్లు పద్మావతి పాపయ్య యాదవ్, అర్చన జయప్రకాశ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పిఅండ్టీ కాలనీలో కార్పొరేటర్ పద్మావతి పాపయ్యయాదవ్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
అత్తాపూర్, నవంబర్ 20: అత్తాపూర్ డివిజన్ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు గడపగడపకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. డివిజన్ పరిధిలోని వాసుదేవరెడ్డినగర్లో సోమవారం డోర్ టూ డోర్ ప్రచారాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో పత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి ప్రచారంలో పాల్గొన్నారు.
మైలార్దేవ్పల్లి, నవంబర్ 20: అన్ని వర్గాల ప్రజలు రాణించే విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశట్టారని మైలార్దేవ్పల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రేమ్గౌడ్ అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని పద్మశాలిపురంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.
పోలింగ్ ఏర్పాట్ల పరిశీలన
మణికొండ, నవంబర్ 20: శాసన సభ ఎన్నికల నిర్వహణ శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎన్నికల పరిశీలన అధికారి తైతులంగ్ పమేయా సూచించారు. సోమవారం నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ను నోడల్ అధికారి సురేందర్రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని నోడల్ అధికారికి సూచించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లకు తాగునీటి వసతిని, 60 సంవత్సరాలు పైబడిన వారికి ప్రత్యేక క్యూలైన్, నడవలేని వారికి వీల్ చైర్, ఎక్కువ సేపు నిలబడలేని వారికి బెంచీలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.