హైదరాబాద్, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ) : మాంత్రిక మహేశ్కుమార్ గౌడ్ తాంత్రిక విమర్శలు మానుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హితవు పలికారు. క్షుద్రపూజల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అశాస్త్రీయ భావనలను పెంచి పోషిస్తున్నదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతల నిరాధార ఆరోపణలు, విమర్శలపై ప్రవీణ్కుమార్ నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి హరీశ్రావుపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ చేసిన ఆరోపణలు ఆయన మానసిక స్థితికి అద్దం పడుతున్నాయని దుయ్యబట్టారు. ఇటీవల హరీశ్రావు తన పుట్టిన రోజు సందర్భంగా ఆలయాలను సందర్శిస్తే కాంగ్రెస్ నేతలు క్షుద్రపూజలంటూ ఆయనపై ఆపాదించడం హిందూ సమాజాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు కావాల్సిన స్రిప్ట్ అంతా సీఎం రేవంత్రెడ్డి, సునీల్ కనుగోలు ఇస్తే.. వాటినే మహేశ్కుమార్ తదితరులు చదువుతున్నారని ఆరోపించారు. హరీశ్రావు ఎక్కడికెక్కడికి వెళ్లాడో తమ వద్ద వివరాలు ఉన్నాయని మహేశ్ అంటున్నారంటే.. ప్రభుత్వం బీఆర్ఎస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నదా? అని అనుమానించారు.
అమెరికాలో గుడుంబా లేదా మరేదైనా మత్తు మందు తాగి అద్దంకి దయాకర్ అసభ్యకరంగా హరీశ్రావుపై దూషణలకు దిగాడని, ఇది సభ్యసమాజం హర్షించదని ప్రవీణ్కుమార్ హెచ్చరించారు. ఎమ్మెల్సీ దయాకర్, సామ రామ్మోహన్రెడ్డి.. విమర్శలకు న్యాయపరమైన సమాధానమివ్వాలి గానీ ఎదురుదాడికి దిగవద్దని సూచించారు.
రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లవుతున్నా ప్రజా సంక్షేమం గాలికి వదిలి కేవలం డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నదని ఆర్ఎస్పీ విమర్శించారు. సింగరేణి, గురుకుల టెండర్లు, సివిల్ సప్లయిస్, నాదర్గుల్ భూముల కుంభకోణాలపై బీఆర్ఎస్ నిలదీస్తుండటంతో తట్టుకోలేకనే కాంగ్రెస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ తప్పులు, వైఫల్యాలను ప్రజల ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండగడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు.
తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం తమ నేతలు కేటీఆర్, హరీశ్రావు నిరంతరం తాపత్రయ పడుతారని, వారి నరనరాన తెలంగాణనే ఉన్నదని ప్రవీణ్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గోసుల శ్రీనివాస్యాదవ్, కిశోర్గౌడ్, రంగినేని అభిలాష్రావు, అబ్రార్ హుస్సేన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.