రాష్ట్ర వ్యాప్తంగా వర్షం బీభత్సం మన కండ్ల ముందు కదలాడుతున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ మహా నగరంలోనూ భారీ ఎత్తున వరుణుడు తన ప్రతాపాన్ని చూపాడు. సాధారణం కంటే ఏకంగా 65శాతం అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఒకవంతైతే.. రెండు నెలల వర్షపాతం కేవలం నాలుగైదు రోజుల్లోనే కుమ్మరించడమంటే మాటలు కాదు. అయినప్పటికీ హైదరాబాద్ నగరంతో పాటు శివారుల్లోనూ వరద ముంపు సమస్య దాదాపుగా ముగింపునకు వచ్చినట్లుగా స్పష్టమవుతున్నది. గతంలో చినుకుపడితేనే.. జలదిగ్బంధంలోకి వెళ్లే అనేక కాలనీలు ఇప్పుడు నిశ్చింతగా ఉన్నాయంటే కేవలం ఎస్ఎన్డీపీ పథకం కింద చేపట్టిన పనుల ఫలితమేనని నగరవాసులు ముక్తకంఠంతో చెబుతున్నారు. హైదరాబాద్ నగరాన్ని 2020లో వరద ముంచెత్తిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ‘వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ)’ చేపట్టింది. నగరంతో పాటు శివారుల్లోనూ ముంపు సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి.. రూ.985.45 కోట్లతో మొదటి విడత చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తవ్వగా.. మరికొన్ని ప్రాంతాల్లో చివరి దశకు రావడంతో పాటు ఇంకొన్ని ప్రాంతాల్లో శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎన్డీపీ కింద చేపట్టిన పనుల పురోగతితో పాటు అనేక ప్రాంతాల్లో వాటి ఫలాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 28 (నమస్తే తెలంగాణ)
ఉప్పల్/మల్కాజిగిరి : రామంతాపూర్ పెద్దచెరువు ప్రాంతంలో గతంలో వరద ముంపుతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మంత్రి కేటీఆర్ స్వయంగా రామంతాపూర్, హబ్సిగూడ ప్రాంతాలలో పర్యటించి, తక్షణమే వరద ముంపు నివారణ పనులు చేపట్టేవిధంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రూ.10.34 కోట్లతో వరద కాలువ పనులు చేపట్టారు. దీంతో ప్రగతినగర్, రామంతాపూర్, ఇందిరానగర్, అరవిందనగర్, భరత్నగర్, గాంధీనగర్, రవీంద్రనగర్, లక్ష్మీనగర్, సాయిచిత్రనగర్ వాసుకుల వరదనీటి సమస్యలు తీరాయి.
రామంతాపూర్ పెద్దచెరువు, చిన్నచెరువు ముంపు కాలనీల సమస్యలు తీర్చిన మంత్రి కేటీఆర్కు రుణపడి ఉంటాం. కాలనీలో గతవారం రోజులుగా వర్షం పడినా వరదనీటి సమస్యలు లేకుండా తగిన చర్యలు చేపట్టాం. రూ.10.34 కోట్లతో వరదనీటి కాలువ పనులు చేపట్టి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాం. దీంతో కాలనీవాసులు మంత్రి కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్నారు. గత పాలకులు చేయని పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది.
బడంగ్పేట : తెలంగాణ ప్రభుత్వం ఎస్ఎన్డీపీ నిధుల నుంచి రూ.115.67 కోట్లు కేటాయించి ముంపు సమస్యకు చెక్ పెట్టింది. గతంలో చిన్న పాటి వర్షానికి కాలనీలన్ని జలమయంగా మారేవి. ఇప్పుడు వారం రోజుల నుంచి నిరవధికంగా వర్షాలు పడుతున్నా వరద నీరు నిల్వడం లేదు. గతంలో బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ కాలనీ, నవయుగ కాలనీ, లక్ష్మీనగర్, శివనారాయణ పురం, మధురా పురి, సీవైఆర్, సీఎంఆర్, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎంఎల్ఆర్ కాలనీ, సత్యసాయి నగర్, శ్రీధర్ కాలనీ, మిథిలానగర్, వెంకటేశ్వర కాలనీ, జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని నబిన్ కాలనీ, డ్రిమ్ సిటీ, డ్రమ్ సిటీ, ఉస్మాన్ నగర్ కాలనీలు చిన్న పాటి వర్షానికి జల దిగ్బంధంలో చిక్కుకునేవి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రూ.115.67 కోట్లు మంజూరు చేయించడంతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. రూ.23 కోట్లతో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ట్రంక్ లైన్ పనులు కొన్ని చోట్ల పూర్తి కాగా మరికొన్ని చోట్ల కొనసాగుతున్నాయి. గతంలో ఎక్కడైతే ముంపు కాలనీలు ఉన్నాయో ప్రస్తుతం ఆ కాలనీలలో ముంపు సమస్య లేకుండా పోయింది.
గతంలో వర్షం వస్తుందంటే భయపడేవాళ్లం. కాలనీలు మునిగిపోతున్నాయంటూ ప్రజల నుంచి ఫోన్లు వచ్చేవి. అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు చేపట్టినా ఫలితం ఉండేది కాదు. సమస్యను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుపోవడంతో అవసరమైన నిధులు కేటాయించారు. దీంతో ట్రంక్ లైన్ పనులు పూర్తి చేయించాం. రెండు మున్సిపల్ కార్పొరేషన్లకు రూ.82.19 కోట్లు కేటాయించడంతో సమస్యకు పరిష్కారం లభించింది. పెండింగ్లో ఉన్న నాలా పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ఎస్ఎన్డీపీ నిధులు కేటాయించి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు.
కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చినుకు పడిన ప్రతిసారి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యేవి. ఇండ్లలోకి నీరు చేరి నిత్యావసర సామాగ్రి పూర్తిగా తడిసి ముద్దయ్యేది. రాత్రంతా నిద్రాహారాలు మానేసి గిన్నెలు, బకెట్లతో నీరు ఎత్తి పోసుకునేవారు. నాలాలు ఉప్పొంగి జనంతో పాటు కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అపార్టుమెంట్ల సెల్లార్లు నీట మునిగి నిచ్చెనలు వేసుకొని బయటికి రావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఎస్ఎన్డీపీ కింద శాశ్వత పరిష్కారం లభించింది. నాలాల విస్తరణ చేపట్టడంతో ఎంతటి కుంభవృష్టి పడినా నాలాల నుంచి వరద నీరు బయటకు రాకుండా సాఫీగా నీరు సాగిపోతున్నది
జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ఎన్సీఎల్, క్వాంటన్పార్క్, అంగడిపేట్ విలేజ్, శ్రీఅవెన్యూ, అపర్ణ మెడోస్, మినాక్షి ఎస్టేట్, స్ప్రీంగ్ఫీల్డ్ కాలనీల్లో వరద ముంపు అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో మొదటగా కోల్కాల్వ నిర్మాణాన్ని ఇదే ప్రాంతాల మీదుగా ఫాక్స్సాగర్ వరకు సుమారు 2.5 కిలోమీటర్లు, రెండవది ఫాక్స్సాగర్ తూము నుంచి వెన్నెలగడ్డ చెరువు వరకు 2.5 కిలోమీటర్లు, మూడవది ఫాక్స్సాగర్ నుంచి కెమికల్ నాలా వరకు 1.1 కిలో మీటర్ల మేరా రూ.95 కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయి. అయితే వీటిలో కోల్కాల్వతో పాటు ఫాక్స్సాగర్ తూము వద్ద జరుగుతున్న పనులు ఇప్పటికే 80శాతం పూర్తి కావచ్చాయి. సమస్య ఉధృతంగా ఉన్న ప్రాంతాల్లో పనులను సకాలంలో పూర్తి చేసేలా ఇరిగేషన్, ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.
సుభాష్నగర్లో రూ.11 కోట్లతో నాలా పునర్నిర్మాణం చేపట్టంతో ముంపు సమస్య తీరింది. అంతేకాకుండా నాలాపై స్లాబ్ ఏర్పాటు చేయడంతో రోడ్డు మార్గం సైతం ఏర్పడింది.
రూ.14 కోట్లతో కుత్బుల్లాపూర్ నుంచి ఐడీపీఎల్ వరకు నాలాకు ఇరువైపుల వాల్స్ నిర్మించడంతో ఆయా కాలనీలకు ముంపు సమస్య తప్పింది.
రూ.80 కోట్లతో నిజాంపేట ఆచారిగుంట నుంచి బాట జంక్షన్ వరకు 1.5 కిలోమీటర్లు మేరకు నాలా నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఫలితంగా కేటీఆర్కాలనీ, బాలాజీకాలనీ, నారాయణరెడ్డినగర్, నారాయణరెడ్డికాలనీ, బండారి లేఅవుట్, నిజాంపేటతో పాటు మరో 15 కాలనీలకు ముంపు సమస్య పరిష్కారం అవుతుంది.
వెన్నెల గడ్డ చెరువు నుంచి గోదావరి హోమ్స్ వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న నాలా నిర్మాణ పనులతో గాయత్రీనగర్, గోదావరి హోమ్స్, వెన్నెలగడ్డ కాలనీలకు వరద నీటి సమస్య తప్పనున్నది.
కొంపల్లి మున్సిపల్ పరిధిలో రూ.13 కోట్లతో నాలా విస్తరణ పనులు కొనసాగుతున్నాయి.
చింతల్ కెమికల్ నాలాపై గోదావరి హోమ్స్, రుక్మిణి ఎస్టేట్, శ్రీనివాస్నగర్, శివనగర్, కేఎంజీకాలనీ, ద్వారకానగర్, గణేశ్నగర్, పాపయ్యయాదవ్ నగర్, తదితర ప్రాంతాల్లో వంతెనలు ఏర్పాటు చేయడంతో భారీ వర్షం పడినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాలనీల వాసులు రాకపోకలు సాగిస్తున్నారు.
నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి కాలనీకి డయా డ్రైనేజీ పైపులైన్, వరద నీటి కాలువలు ఏర్పాటు చేయడంతో ముంపు సమస్య పరిష్కారమైంది.
గతంలో చిన్నపాటి వర్షం పడినా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాకారంతో నియోజకవర్గంలో కోట్ల వ్యయంతో నాలాల విస్తరణ పనులు జరిగాయి. దాదాపుగా 80 శాతం వరకు పనులు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఎంతటి కుంభవృష్టి వచ్చినా ప్రజలకు ఎలాంటి డోకా లేదు. ఇంకా 20 శాతం పనులు మిగిలిపోయాయి. వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాం.
అమీర్పేట్/బేగంపేట : లీలానగర్ సమీపంలోని శాంతిబాగ్ అపార్ట్మెంట్స్ సముదాయంలో నివాసముండే వారు చినుకుపడితే నిద్రలేని రాత్రులు గడిపేవారు. మంత్రి తలసాని రెండేండ్ల కిందట రూ.35 లక్షల వ్యయంతో వరదనీటి పైపులైను నిర్మాణ పనులను ప్రారంభించి పూర్తి చేశారు. దీంతో అప్పటి నుంచి శాంతిబాగ్ నివాసితులకు వరద ముంపు సమస్య తీరింది. అయితే సరిగ్గా వారం రోజుల కిందట మరోసారి శాంతిబాగ్ నివాసితులు డ్రైనేజీ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇటీవల ఈ రోడ్డులో నిర్మితమైన ఆసుపత్రి సెల్లార్లోకి చేరిన వరదనీటిని బయటకు పంపే మార్గం తెలియక, మోటార్లను వినియోగించి ఆ వరదనీటిని స్థానిక సీవరేజీ డ్రైన్లోకి వదిలారు. దీంతో సాధారణ సామర్ధ్యంతో ఉండే సీవరేజీ డ్రైన్లోకి పెద్దఎత్తున ప్రెషర్తో వరదనీటిని వదలడంతో శాంతిబాగ్ అపార్ట్మెంట్స్ నివాసితులకు మరోసారి పాత అనుభవం ఎదురైంది. దీంతో మరోసారి మంత్రి తలసాని, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు.