శేరిలింగంపల్లి, మార్చి 28: దేశం మొత్తం నేడు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నదని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. లింగంపల్లిలోని అభినవ్ బ్యాంకెట్ హాలులో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి డివిజన్ ఆత్మీయ సమ్మేళనానికి స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్తో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా అరెకపూడి గాంధీ మాట్లాడుతూ… రాష్ట్రంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి దేశంలో మరెక్కడా జరగలేదన్నారు. కొత్తగా ఏర్పాటు చేసుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిపారని చెప్పారు. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రకటనలను తిప్పికొట్టాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఉన్నదన్నారు.పార్టీకి ప్రజల మధ్య వారధిగా పనిచేస్తూ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
డివిజన్ అభివృద్ధికి రూ. 315 కోట్లు
నియోజకవర్గంలోని శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధికి రూ.315 కోట్ల 57 లక్షల 656 వెచ్చించామని ఎమ్మెల్యే గాంధీ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో శేరిలింగంపల్లి, కొండాపూర్ రెండు డివిజన్లు ఒకే డివిజన్గా ఉన్నప్పటికీ కేవలం రూ.22 కోట్లు మాత్రమే వెచ్చించారని… నాటికి, నేటికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఇప్పటికే డివిజన్లో దాదాపు 80 శాతం సంక్షేమం, అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, అసంపూర్తి పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ సుజాత , పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమ్మేళనంలో పాల్గొన్నారు.
ప్రతిభకు ప్రోత్సాహం
తెలంగాణ యాస, జీవనశైలి, గ్రామీణ నేపథ్యమే ప్రధానాంశంగా ఇటీవల విడుదలైన బలగం సినిమా అందరి ప్రశంసలు అందుకుంటున్నదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సినిమాలో నటించిన శేరిలింగంపల్లి సురభీ కాలనీకి చెందిన నటి విజయలక్ష్మిని ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే గాంధీ సన్మానించారు. అనంతరం ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులకు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ స్వయంగా భోజనాలు వడ్డించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కూడా భోజనం చేశారు.