మియాపూర్ , డిసెంబరు 17: సీసీ కెమెరాలు అలుపెరగకుండా కాపలా ఉంటాయని, వాటి ఏర్పాటును ప్రతి ఒక్కరూ గుర్తించాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. నిందితులను గుర్తించడంలో పోలీసుశాఖకు సీసీ కెమెరా దృశ్యాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని బాగ్మీర్, సుమిత్రనగర్, మాధవరం నగర్ బీ,సీ బ్లాక్ల్లో సీడీపీ నిధులు రూ. 12 లక్షలతో ఏర్పాటు చేసిన 60 సీసీ కెమెరాలను ఆదివారం కార్పొరేటర్ రోజాదేవితో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. తన నిధుల నుంచి కోటి రూపాయలను సీసీ కెమెరాల ఏర్పాటుకు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పోలీసు శాఖకు తోడు కాలనీ సంక్షేమ సంఘాలు సైతం సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో రంగారావు, సంజీవరెడ్డి, చంద్రకాంత్రావు, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
కొండాపూర్ : ముచ్చటగా మూడో సారి శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజల సేవలో సదా ముందుంటానని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని ఆదివారం చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులారఘునాథరెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ వాసులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ… ముచ్చటగా మూడోసారి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరిస్తూ గతంలో చేపట్టిన పనులను పూర్తి చేస్తానన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.