మియాపూర్, సెప్టెంబర్ 8 : నగరంలో డల్లాస్ను తలపించే ప్రాంతం ఏదైనా ఉన్నదంటే.. అది శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, హైటెక్సిటీ అని ఎవరిని అడినా టక్కున చెప్పేస్తారు. వందలాది ఐటీ కంపెనీలు, లక్షలాది ఉద్యోగులు సహా మరెన్నో ప్రత్యేకతలతో శేరిలింగంపల్లి ప్రపంచ పటంలో చోటు సంపాదించింది. గడిచిన 50 ఏండ్ల చరిత్రను తుడిచేసి కేవలం తొమ్మిదేండ్లలోనే రూ.9వేల కోట్లతో విశేషమైన ప్రగతి బాట పట్టించాం. దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు నివసించే మినీ భారత దేశంగా శేరిలింగంపల్లి ఖ్యాతిని గడిచింది. ఏ రంగంలోనైనా నగర వాసులు తలెత్తి చూడాల్సిందే తప్పా.. తల దించే పరిస్థితి లేకుండా చేశాం. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా.. అనుక్షణం వాళ్ల మధ్యనే ఉంటున్నానని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్ అరెకపూడి గాంధీ అన్నారు. నియోజకవర్గం పురోభివృద్ధే ధ్యేయంగా అన్ని రంగాల్లో తీర్చిదిద్ది ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందిస్తున్నాం. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలకు మించి చేశాం. మేము చేసిన అభివృద్ధి, ఐటీ అందాలు, అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, ఇలా మరెన్నో ప్రజలముందున్నాయి. వారి ఆశీర్వాదంతో అఖండ మెజార్టీతో మూడవ సారి గెలుపొందుతా. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లతో హ్యాట్రిక్ సాధించడం ఖాయం.
2014లో జరిగిన ఎన్నికలలో నియోజకవర్గం ప్రజల సంపూర్ణ ఆదరాభిమానాలు చూరగొని అత్యధికంగా 80వేల పైచిలుకు బంపర్ మెజార్టీతో ఘన విజయం సాధించా. తదుపరి బీఆర్ఎస్లో చేరి ఆ వెంటనే కార్పొరేటర్ ఎన్నికలలో 11 డివిజన్లను కైవసం చేసుకున్నా. 2018లోనూ ఘన విజయం పొందాను. నిత్యం ప్రజలలో ఉండి వారి సమస్యల పరిష్కారం , నియోజకవర్గం పురోగతి ధ్యేయంగా పారదర్శకంగా ముందుకు పోతున్నా. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల ఆశీస్సులు మెండుగా ఉండటం వల్ల వరుసగా మూడో సారి టికెట్ ఇచ్చారు.
ఉమ్మడి పాలనలో నియోజకవర్గం నామమాత్రపు అభివృద్ధితో సాధారణ పురోగతితో చతికిలపడింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తదుపరి అతి పెద్ద నియోజకవర్గం కావటంతో అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు అధిక ప్రాధాన్యతనిచ్చారు. నియోజకవర్గం అవసరాలేమిటో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తెలుసుకుంటూ పనుల నిర్వహణకు నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తూ తొమ్మిదేండ్లలో చేసిన కృషి నియోజకవర్గం దశను పూర్తిగా మార్చేసింది. వందలాది ఐటీ కంపెనీలు, లక్షలాది ఉద్యోగులు సహా మరెన్నో ప్రత్యేకతలతో శేరిలింగంపల్లి ప్రపంచ పటంలోనే చోటు సంపాదించింది. ప్రజా సౌకర్యానికి పెద్ద పీట వేస్తూ చేపట్టిన అభివృద్ధి పనులు, కల్పించిన మౌలిక వసతులు గడిచిన 50 ఏండ్ల చరిత్రను తుడిచేసి కేవలం తొమ్మిదేండ్లలోనే విశేషమైన ప్రగతి బాట పట్టింది. దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు నివసించే మినీ భారత దేశంగా శేరిలింగంపల్లి ఖ్యాతిని గడిచింది.
ప్రభుత్వ పెద్దల సంపూర్ణ తోడ్పాటుతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నాం. ఈ తొమ్మిదేండ్ల కాల వ్యవధిలో రూ.9 వేల కోట్ల వరకు నిధులను వెచ్చించి విస్తృతమైన మౌలిక వసతులు కల్పించాం. ప్రధానంగా రూ.2 వేల కోట్ల నిధులతో ఎస్ఆర్డీపీ కింద పది భారీ ప్రాజెక్టులైన ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు, లింక్ రహదారులను కల్పించి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాం. నియోజకవర్గానికి వలసలు ఇంకా పెరుగుతుండటంతో ఇంకా రోడ్లను విస్తరించాల్సి ఉన్నది. రూ.వెయ్యి కోట్ల నిధులతో నియోజకవర్గంలోని 11 డివిజన్లలో పక్కా అంతర్గత రహదారుల నిర్మాణాలను చేపట్టాం. అదే విధంగా డ్రైనేజీలు, వరద కాలువలు, 18 రిజర్వాయర్లు, వందలాది కిలో మీటర్ల పైప్లైన్తో ఇంటింటికీ తాగునీటి వసతిని సైతం కల్పించాం. ప్రధానంగా ముంపు సమస్యలేకుండా నాలాల విస్తరణ, బాక్సు డ్రైన్లు సహా ఇతర ఎన్నో మౌలిక వసతులను కల్పించాం. సింహభాగం అభివృద్ధి పనులను 9 ఏండ్లలో పూర్తి చేయగా.. రాబోయే ఐదేండ్లలో ఇంతకు మించిన పురోగతిని ప్రజలకు చూపించే లక్ష్యంతో ఉన్నాం.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నివసించే ప్రజల ఆనందం మాటల్లో చెప్పలేనిది. రాష్ర్టంలోనే అతి పెద్ద నియోజకవర్గమైనందున సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటం, విస్తృతంగా పనులను చేపడుతుండటంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన నెలకొంటున్నది. అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతుండటమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రజల అవసరాలను, కాలనీల సమస్యలను తెలుసుకునేందుకు అహర్నిషలు నేను సైతం క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యే ఉంటుండటంతో ప్రజలు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని వ్యక్తం చేశారు. తమకు అండగా ఎమ్మెల్యే, ప్రభుత్వం ఉన్నదన్న సంపూర్ణ భరోసాతో ఉన్నారు.
హ్యాట్రిక్ సాధిస్తాననటంలో ఎటువంటి సందేహమే లేదు. మా ఎమ్మెల్యేను మూడోసారి గెలిపించుకుంటామని ప్రజలు ధీమా ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటిని దరి చేర్చటంలో పారదర్శకంగా నేను చేస్తున్న కృషే నన్ను సునాయాసంగా, మంచి మెజార్టీతో గెలుపు తీరాలకు చేరుస్తాయి. ప్రధానంగా ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసం, నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు, ఉద్యమకారుల కృషి మా విజయసోపానాలు. మరోమారు గెలిచి ఈ విజయాన్ని సీఎం కేసీఆర్కు బహుమతిగా అందిస్తా.
కాంగ్రెస్, బీజేపీల నేతలు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలలో సంపూర్ణ విశ్వాసం నెలకొని ఉన్నది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి బీఆర్ఎస్, సీఎం కేసీఆర్తో తప్ప మరెవరితోనూ సాధ్యం కాదన్న స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. అందుకే గడిచిన రెండు దఫాలుగా సంపూర్ణ అధికారాన్ని సైతం అందించారు. ఈ సారి కూడా హ్యాట్రిక్ విజయాన్ని అందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలతో నియోజకవర్గంలో వేలాది మంది లబ్ధిపొందుతున్నారు. పథకాలు తమకెంతో అండగా నిలుస్తున్నాయని పలు సందర్భాలలో ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అభివృద్ధి కుంటు పడటం ఖాయమన్న భావన ప్రజల్లో బలంగా ఉన్నది. అందుకే ప్రజా విశ్వాసం సంపూర్ణంగా చూరగొన్న కారుకే మరో మారు అధికారం అందిస్తామని ప్రజలు చెబుతున్నారు.