బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కొత్తపుంతలు తొక్కుతున్నది. ఇప్పటికే రెండు దఫాలుగా ప్రచారం ముగించిన గులాబీ అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తలను కలుపుకొనిపోతూ ప్రజల్లో కలిసిపోతున్నారు. ఆట, పాటలతో సందడి చేస్తున్నారు. మన నాయకుడు మనలో ఒకడు అంటూ ఓటర్ల మనసులను గెలుచుకుంటున్నారు.
బేగంపేట్, నవంబర్ 7: అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ బేగంపేట్ ప్రజల కష్టాలను ఏనాడూ పట్టించుకోలేదని.. తొమ్మిదిన్నరేండ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం బేగంపేట్లో ముంపు సమస్యను పరిష్కరించిందని కూకట్పల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఆయన బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరితో కలిసి మయూరిమార్గ్, ప్రకాశ్నగర్, మాతాజీ నగర్, శ్యాంలాల్లో పర్యటించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. నాలా సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ సహకారంతో ఎనభై శాతం సమస్యను పరిష్కరించామని తెలిపారు.
ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే మిగిలిన సమస్యలను కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని బేగంపేట్ డివిజన్ వాసులకు అందేలా కృషి చేశామని పేర్కొన్నారు. మరిన్ని సంక్షేమ పథకాలతో వస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శ్రీహరి, డివిజన్ అధ్యక్షుడు సురేశ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి నరేశ్, సీ సత్యనారాయణ, ప్రవీన్, రమేశ్, యాదగిరిగౌడ్, శ్రీశైలం, శివ తదితరులు పాల్గొన్నారు.