కీసర, మార్చి 12: సివిల్ పనులు ఇప్పిస్తానంటూ కాంట్రాక్టర్ల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి, విదేశాలకు వెళ్తున్న మిషన్ భగీరథ ఏఈ(సస్పెండ్)పై కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎనిమిది నెలల కిందట రాహుల్ మిషన్ భగీరథ కీసర మండల ఏఈగా పనిచేశాడు. అతడు ఆన్లైన్ గేమ్స్, రమ్మీలాంటి పలు బెట్టింగ్ గేమ్స్కు బానిసై.. సుమారు రూ.15 కోట్ల వరకు పలువురి వద్ద అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చేందుకు కొత్త నాటకానికి తెరలేపాడు. కీసర మండలంలోనే కాకుండా.. ఇతర ప్రాంతాల్లో కాంట్రాక్టర్లకు సివిల్ పనులు ఇప్పిస్తానంటూ సుమారు 37 మందిని నమ్మించి.. వారి వద్దనుంచి రూ.15 కోట్ల వరకు తీసుకున్నాడు. ఈ వ్యవహారం ఉన్నతాధికారులకు తెలియడంతో అతడిని మిషన్ భగీరథ ఏఈ పోస్టు నుంచి ఆరు నెలల కిందట సస్పెండ్ చేశారు. రాహుల్కు సహకరించిన మరో అధికారిని సైతం విధుల నుంచి తప్పించారు. డబ్బులిచ్చిన బాధితులందరు ఒక్కటై కీసర పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అతడిపై కీసర పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అతడు కొన్ని నెలలుగా పరారీలో ఉన్నాడు. సోమవారం అతడు ఇండియా నుంచి విదేశాలకు పారిపోతుండగా.. ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ పోలీసులు అతడిని సోమవారం రాత్రి కీసర పోలీసు స్టేషన్కు తీసుకొచ్చి, అప్పగించారు. కీసర పోలీసులు అతడిని విచారించారు. రాహుల్ భార్య, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. చాలా మందికి డబ్బులు ఇస్తామంటూ రాహుల్ కుటుంబీకులు ఒప్పుకున్నారని, డబ్బులు ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాహుల్ను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు కీసర ఇన్స్పెక్టర్ వెంకటయ్య తెలిపారు. 2022 నుంచి రాహుల్ ఆన్లైన్ బెట్టింగ్కు బానిసయ్యాడని, మొబైల్ అప్లికేషన్లో సాట్ స్పోర్ట్స్ను ఇన్స్టాల్ చేసి, తెలివిగా ఒక ఐడీని సృష్టించాడని ఇన్స్పెక్టర్ చెప్పారు. డబ్బులు సంపాదించాలన్న దురాశతో అతడు గేమ్స్ ఆడినట్టు తెలిపారు. మిషన్ భగీరథలో కాంట్రాక్టర్ల కోసం ఎక్కువ పనులు, వర్క్ ఆర్డర్ల కోసం ప్లాన్ చేశాడని, రూ.2 లక్షల నుంచి రూ.5లక్షల వరకు నకిలీ వర్క్ ఆర్డర్లు, ప్రొసిడింగ్లను సిద్ధం చేసి, కాంట్రాక్టర్ల వద్ద భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నాడని చెప్పారు. చాలా మందికి కాంట్రాక్టు పనులు ఇప్పిస్తానంటూ.. అతడు తయారు చేసిన నకిలీ వర్క్ ఆర్డర్ ప్రొసిడింగ్స్ను జారీచేసి, తన స్నేహితుడు సాయి ద్వారా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడని, చాలా మంది నుంచి సుమారు రూ.8 కోట్ల వరకు వసూలు చేశాడని తెలిపారు. కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టాడని, బాధితుల ఫిర్యాదు మేరకు రాహుల్పై కేసు నమోదు చేసి, అతడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించామన్నారు.