ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే
దేశ చరిత్రలోనే బ్రహ్మాండంగా ఇండ్ల నిర్మాణం
ఎండకు ఎండి.. వానకు తడిసిన బాధలు లేవు
బండమైసమ్మనగర్లో ‘డబుల్’ ఇండ్ల ప్రారంభోత్సవం
మనసున్న మారాజు సీఎం కేసీఆర్: మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్
310 ఇండ్లకు ఐదు ఫ్లోర్ల బిల్డింగ్లో 11 లిఫ్టులు ఏర్పాటు..
సిటీబ్యూరో, మే 15(నమస్తే తెలంగాణ)/బన్సీలాల్పేట : ఇది బండ మైసమ్మ బస్తీ కాదని, బండ మైసమ్మనగర్ కాల నీ అని, ఈ ప్రాంతాన్ని చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వి. ప్రశాంత్రెడ్డి అన్నారు. అంత బ్రహ్మాండమైన తీరుగా, సీఎం కేసీఆర్ మదిలో మెదిలిన కాలనీ రూపుదిద్దుకున్నదని పేర్కొన్నారు. బన్సీలాల్పేట్ డివిజన్లోని బండ మైసమ్మ బస్తీలో ప్రభుత్వం పేదల కోసం రూ.27.20 కోట్లతో నిర్మించిన 310 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆయన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ ఎస్.వాణీదేవి, కలెక్టర్ శర్మన్, కార్పొరేటర్ కె.హేమలతలతో కలిసి ఆదివారం ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంతమంచి ఇండ్లు కట్టించాలనే ఆలోచన ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదని, దీంతోపాటు కేంద్ర ప్రభుత్వమూ ధైర్యం చేయలేకపోయిందని చెప్పారు.
పేదలు ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా ప్రభుత్వమే అన్నీ భరిస్తూ పేదోడి సొంతింటి కలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్దని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కలను నూటికి నూరు శాతం మంత్రి శ్రీనన్న నెరవేర్చుతున్నాడని, బస్తీల్లో పిట్టగూళ్ల లాంటి ఇండ్లను తొలగించి.. ఆత్మగౌరవ సౌధాలను నిర్మించి ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని చెప్పారు. ఐడీహెచ్ కాలనీని ఒక నమూనాగా సక్సెస్ ఫార్ములాను రుజువు చేసిన ఘనత మంత్రి శ్రీనన్నదేనని పేర్కొన్నారు. నియోజకవర్గంలో దాదాపు 6, 7 బస్తీల్లో రెండువేల ఇండ్లకు పైగా అద్భుతంగా నిర్మించిన ఘనత ఆయనదని కొనియాడారు.
గోదావరి, కృష్ణా నదుల నుంచి వందల కిలోమీటర్ల నుంచి నగరానికి పైపులైన్లు వేసి నీటిని తీసుకువచ్చి ఇంటింటికీ నీటిని అందజేస్తూ.. అట్లాంటి సమస్యలను అధిగమించిన ఘనత మన ప్రభుత్వానిది అని చెప్పారు. లచ్చవ్వ అనే లబ్ధిదారును పలుకరించగా కేసీఆర్, శ్రీనివాస్ యాదవ్లు ఇద్దరు తనకు కొడుకుల తీరుగ అని జవాబిచ్చిందని… ఇంతకంటే ఏ సంతోషకరమైన విషయం ఏముంటుందని ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో బండమైసమ్మ బస్తీలో బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తామనడం గొప్పవిషయమని చెప్పారు. ఈ సముదాయంలో 16 వాణిజ్యముదాయాలు నిర్మించారని వీటిని కిరాయికి ఇచ్చి సముదాయంలోని విద్యుత్తోపాటు లిఫ్టుల నిర్వహనకు ఉపయోగించుకోవాలనే సీఎం సూచనను పాటించాలని కోరారు. ఇండ్ల కోసం దళారులను నమ్మి ఎవ్వరికీ డబ్బులు ఇవ్వొద్దని లబ్ధిదారులకు సూచించారు. మంత్రి కేటీఆర్ సూచనల మేరకు ఇప్పటికీ 60 వేల ఇండ్లు కట్టించామని, మరో 40వేల ఇండ్లు త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. హైదరాబాద్లో ఇది 23వ కాలనీ అని, ఇందులో 7 కాలనీలు సనత్నగర్లోనే నిర్మించడం గొప్పవిషయమని పేర్కొన్నారు.
బస్తీ ముఖచిత్రం మారింది: మంత్రి తలసాని
‘బండమైసమ్మ బస్తీ గురించి చెప్పాలంటే ఎంతో సంతోషదాయకమైన సందర్భం. ఎండకు ఎండి.. వానకు తడిన బాధలు, గాధల నుంచి సమున్నతమైన గౌరవంతో బతికేందుకు డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే’ అని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా బ్రహ్మాండమైన పద్ధతిలో ఇండ్లను కట్టించామని తెలిపారు. బస్తీలోని ప్రతి పేదవాడికి రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇండ్లను అందజేస్తున్నట్లు చెప్పారు. ఐదేండ్ల కిందటి బస్తీకి ఇప్పటి బస్తీ ఎంతో మార్పు చెందిందని ఒకప్పుడు మురుగు పరుగు పెట్టేదని.. ఈ ప్రాంతంలో ముత్యాల్లాంటి డబుల్ ఇండ్లు పైసా ఖర్చులేకుండా నిర్మించినట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపున్న గొప్ప నేత అని, పేదల బాధలు, గాధలను తుడిచే మనసున్న మారాజు ఆయన అని పేర్కొన్నారు. అద్దం.. మొఖం.. ఒక్కటే దగ్గర అనేవిధంగా ఎంతో పారదర్శకతతో ఇండ్ల కేటాయింపు చేశామని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇండ్లతో పాటు ప్రతి ఇంటికీ ఉచిత తాగునీటిని అందించాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అని పేర్కొన్నారు. అంతకుముందు మంత్రులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మంత్రులకు కుంకుమ తిలకం దిద్ది మంగళ హారతులు ఇచ్చి, డప్పు చప్పుళ్ళు, బ్యాండు మేళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత కుమారి, తహసీల్దార్ బాలశంకర్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, హౌజింగ్ అధికారులు సురేశ్, వెంకటదాస్ రెడ్డి, గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు కె.లక్ష్మీపతి, కమల్ కుమార్, జగదీశ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, కార్యదర్శులు రాజేందర్, మహేందర్ పాల్గొన్నారు.