అమీర్పేట్, అక్టోబర్ 6 : అమీర్పేట్ డీకేరోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్ శుక్రవారం ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. మొదటిరోజు పాఠశాలకు చెందిన 750 మందికి పైగా విద్యార్థులు అల్పాహారాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ పోషక విలువలతో కూడిన అల్పాహారాన్ని అందించాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన కార్యరూపం దాల్చడం శుభసూచకమన్నారు.
పాఠశాల అధ్యాపకులు కూడా విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని తీసుకోవాలని, ఎక్కడైనా నాణ్యతా లోపాలు తలెత్తితే వెంటనే స్పందించాలని అధ్యాకులకు సూచించారు. తమ పిల్లలు ఉన్నతంగా చదవాలన్న తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణలో అనుసరిస్తున్న విద్యా విధానాలకు దేశ వ్యాప్తంగా చక్కటి గుర్తింపు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేశ్, విద్యాశాఖ ఆర్జేడీ విజయలక్ష్మి, కార్పొరేటర్ కేతినేని సరళ, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారితో పాటు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.