హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ( Minister Sabitha Indra Reddy), పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Minister Talasani ) అన్నారు. సోమవారం సనత్నగర్ లోని అశోక్ కాలనీలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని సమస్యలు, విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు.
మంత్రులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( CM KCR) ఆదేశాల మేరకు వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేసి 7 లక్షల మందికి విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఒక్కో విద్యార్ధి కోసం సంవత్సరానికి లక్షా 20 వేల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. మన బస్తీ -మన బడి ( Mana Basti- Mana Badi) కార్యక్రమం క్రింద అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నామని వివరించారు.
ఇంగ్లీషు మీడియం ను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించామని పేర్కొన్నారు. సన్న బియ్యంతో నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని విద్యార్ధులకు అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలతో పాటు నోటు పుస్తకాలను అందిస్తున్న ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు. కేజీ టు పీజీ ఉచితంగా అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. తెలంగాణ వచ్చిన తరువాత రెండుసార్లు డైట్ చార్జ్లు పెంచిందని అన్నారు .