సిటీబ్యూరో, సెప్టెంబరు 6 (నమస్తే తెలంగాణ) : గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గృహలక్ష్మి పథకం కార్యక్రమం అమలు, లబ్ధిదారుల ఎంపికపై హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ పేద ప్రజల ఇంటి నిర్మాణానికి ఆర్థికంగా చేయూతనందించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఒక్కో నియోజకవర్గం పరిధిలో 3వేల మంది అర్హులకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. వచ్చిన దరఖాస్తుల్లో అర్హలైన వారిని గుర్తించేందుకు పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. శనివారంలోగా పూర్తిస్థాయిలో దరఖాస్తులు చేసుకునే విధంగా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మంత్రి కోరారు. పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో భాగంగా మొదటి విడతలో 11,700 మంది లబ్ధిదారుల ఎంపిక, కేటాయింపు ఎంతో పారదర్శకంగా నిర్వహించిన అధికారులను మంత్రి అభినందించారు. రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు వాణీదేవి, స్టీఫెన్సన్, ముంతాజ్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్, ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్, బలాల, కౌసర్ మొహినుద్దీన్, మౌజం హుస్సేన్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ చంద్రకాంత్, హౌసింగ్ ఈఈ వెంకటదాసురెడ్డి, ఆర్డీవోలు, తాసీల్దార్లు పాల్గొన్నారు.
రెండో విడత ఇండ్ల కేటాయింపు
రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి సంబంధించి ఈ నెల 8వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్, కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్తో ప్రత్యేక సమావేశం జరుగనున్నది. మొదటి విడతలో ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా ర్యాండమైజేషన్ పద్ధతిలో ఎంతో పారదర్శకంగా ఆన్లైన్ డ్రా నిర్వహించారు. ఈ నేపథ్యంలో 8వ తేదీన జరిగే సమావేశంలో రెండో విడత ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన తేదీలను ఖరారు చేయనున్నారు.