అబిడ్స్, సుల్తాన్బజార్, నవంబర్ 13: నాంపల్లి బజార్ఘాట్ ప్రాంతంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
మొదట కారులో మంటలు లేచాయని, ఆ మంటలు విద్యుత్ వైర్లకు అంటుకోవడంతో వచ్చిన నిప్పు రవ్వలు భవనంలో పడి రసాయనాలు, డీజిల్ డ్రమ్ములకు అంటుకోవడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానాలు వినిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంతో సీసీ కెమెరాలు, వాటి వైర్లు కూడా కాలిపోయాయి.
ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో పొగలు వ్యాపించగా.. అగ్నిమాపక శాఖకు సకాలంలో సమాచారం అందకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. తొలుత పొగను గమనించిన స్థానికులు పటాకుల పొగగా భావించారు. దీంతో ప్రమాదాన్ని గుర్తించలేకపోయాయని తెలిపారు.
అగ్నిప్రమాద ఘటనలో చోటు చేసుకున్న పరిణామాలతో స్థానిక ప్రజలు ఒక పక్క భయాందోళనలకు గురికావడమే కాకుండా ఇబ్బందులకు గురయ్యారు. ఒక పక్క మంటలు ఆర్పుతుండగా.. మరోపక్క కెమికల్ డ్రమ్ముల నుంచి రసాయనాలు బయటకు వచ్చాయి. దీంతో రోడ్డు బయట రసాయనాలు పారాయి. దీంతో అగ్నిమాపక, పోలీసులు, మీడియా, స్థానికులు, ఘటనా స్థలికి వచ్చిన రాజకీయ నాయకులు అక్కడ అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడింది. చాలా మంది ఆ కెమికల్స్ లోనుంచి నడవడంతో వారి బట్టలు, బూట్లు, చెప్పులు పాడైపోయాయి. కెమికల్స్ ప్రభావానికి చాలా మంది ఇబ్బంది పడ్డారు. పోలీసులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు.
బజార్ఘాట్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని నాయకులు, కార్యకర్తలతో కలిసి నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిరోజ్ఖాన్ సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో కొందరు ఎంఐఎం నాయకులు అక్కడికి చేరుకొని అగ్ని ప్రమాదాన్ని రాజకీయం చేయడమేంటని ఫిరోజ్ఖాన్ను అడ్డుకొని నిలదీశారు. దీంతో ఇరు పార్టీల మధ్య వివాదం నెలకొంది. సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకొని.. ఇరు వర్గాల వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఫిరోజ్ఖాన్, ఎంఐఎం నాయకులను వేర్వేరు మార్గాల్లో పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఓ దశలో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ.. ఉదయం నుంచి సహాయక చర్యల్లో పాల్గొన్నామన్నారు. అంతా అయిపోయిన తర్వాత ఫిరోజ్ఖాన్ వచ్చి రాజకీయం చేశాడని తెలిపారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఎం వెంకటేశ్వర్లు, నాంపల్లి ఇన్స్పెక్టర్ అభిలాష్ నేతృత్వంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని పలు పార్టీల నాయకులు సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతా రావు, నాంపల్లి ఎంఐఎం పార్టీ అభ్యర్థి మాజిద్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫెరోజ్ఖాన్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సభ్యులు చాడ వెంకట్రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్పాషా, ఈటీ నర్సింహా తదితరులు సందర్శించి.. ప్రమాదంపై అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.