హైదరాబాద్ : బంజారాహిల్స్లో నూతనంగా నిర్మించిన సేవాలాల్ బంజారా భవన్, కుమ్రం భీమ్ ఆదివాసీ భవన్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సీఎస్ సోమేశ్ కుమార్, MAUD స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ లతో కలిసి శుక్రవారం సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. కోట్లాది రూపాయల విలువైన భూమిని కేటాయించి ఒక్కో భవనాన్ని 22 కోట్ల రూపాయలతో ఎంతో అద్భుతంగా నిర్మించామన్నారు. సీఎం కేసీఆర్ ఈ నెల 17 వ తేదీన ప్రారంభిస్తారని తెలిపారు.
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ పేరుతో బంజారా భవన్, ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీమ్ పేరుతో ఆదివాసీ భవన్ ను నిర్మించినట్లు వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజనుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని పేర్కొన్నారు.
భవనాల ప్రారంభించిన అనంతరం NTR స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఈ సభకు రాష్ట్రంలోని గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.