సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): బీసీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు పర్చారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ రాసిన ‘బీసీ ఆత్మగౌరవ భవనాలు’ పుస్తకాన్ని ఆదివారం మంత్రి నివాసంలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్మాణాత్మకంగా కృషి చేస్తూ వస్తుందని అన్నారు. చేతి వృత్తుల జీవితాలకు భరోసా కల్పించామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా బీసీలకు ఆత్మగౌరవ భవనాలు కట్టించామని తెలిపారు.
మత్స్య, నేత, గీత, యాదవ, రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వకర్మ, అత్యంత వెనుకబడిన బీసీ వర్గాలను ఆదుకున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. చేతి వృత్తుల వారికి లక్ష రూపాయలు అందించామని తెలిపారు. బీసీలకు అండగా నిలిచిన ప్రభుత్వానికి బహుజనులు కూడా అండగా నిలుస్తారని చెప్పారు. బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలు పచ్చి బూటకమని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్లకు బీసీ ఓట్ల మీద ఉన్న శ్రద్ధ బీసీల జీవన ప్రమాణాలు పెంచడంపై లేదని మండిపడ్డారు.
బీసీ జనగణన చేయమంటే పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్లు బీసీలకు మేలు చేస్తామని చెప్పడం ఆష్యాస్పదంగా ఉన్నదని తెలిపారు. మొదట కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలు అంబానీ, ఆదాని లాంటి వారికి రక్షకులుగా మారారనే తప్ప.. ‘సంపద పెంచడం, సంపద పంచడం’పై కనీస ఆలోచన చేయలేని విమర్శించారు. రచయిత జూలూరు మాట్లాడుతూ.. బహుజనులకు సాయం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక ఆలోచనలకు ఆచరణ రూపంగా బీసీలు నిలిచి తీరుతారని, కేసీఆర్ ప్రభుత్వానికి వెన్ను దన్నుగా ఉంటారని అన్నారు.