కంటోన్మెంట్, సెప్టెంబర్ 12 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) ఆసుపత్రి పనులు బొల్లారంలో వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పనులు ప్రాథమిక దశలో ఉన్నాయని, త్వరలో పూర్తవుతాయని, తిరుమలగిరి వాసులకు వైద్యం మరింత చేరువ కానున్నదని చెప్పారు. మంగళవారం కంటోన్మెంట్లోని రెండు బస్తీ దవాఖానలు, రెండు ఆరోగ్య మహిళా కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనుదీప్, కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నాగేశ్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లాస్య నందిత, మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డిలతో కలిసి మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానలతోపాటు టిమ్స్ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఏదైనా పెద్ద వైద్యం కోసం నగరంలోని గాంధీ, ఉస్మానియాతోపాటు ఇతర ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని, దీంతో ఆస్పత్రి ఖర్చులతోపాటు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. దీన్ని అధిగమించడానికి నగరానికి నలువైపులా టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలకు సీఎం కేసీఆర్ పునాదులు వేశారని గుర్తు చేశారు. బొల్లారంలో 1200 పడకల సామర్థ్యంతో నిర్మాణం చేపట్టామని, సర్కారు రూ.897 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. 28.41 ఎకరాల్లో గ్రౌండ్ ఫ్లోర్తోపాటు ఐదు అంతస్తుల్లో వేగంగా నిర్మాణం జరుగుతుందన్నారు.
బస్తీ దవాఖానలతో సుస్తీకి ఇక స్వస్తి చెప్పాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బస్తీ దవాఖానలు ప్రజల ఆరోగ్యానికి దోస్తీ దవాఖానలుగా మారాయని చెప్పారు. ఈ దవాఖానలలో 158 రకాల మందులు ఇచ్చి, 57 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని తెలిపారు. రోగాన్ని గుర్తించి మందులు వాడితే దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా ఉండవచ్చన్నారు. పేదలకు వైద్యం అందించాలనే సదుద్దేశంతోనే నగర వ్యాప్తంగా బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని, ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రతి 10వేల మందికి ఒక బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. బస్తీ దవాఖానలో ఒక డాక్టర్, ఒక స్టాఫ్నర్సు, ఒక నర్స్తోపాటు మందులు, రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, మాజీ సభ్యులు లోక్నాథం, పాండుయాదవ్, అనితాప్రభాకర్, నేతలు నివేదిత, టీఎన్ శ్రీనివాస్, ముప్పాడి మధుకర్, తేజ్పాల్, ప్రవీణ్యాదవ్, దేవులపల్లి శ్రీనివాస్, పెద్దాల నర్సింహ, సాయికిరణ్, కుమార్, మురళీ, సదానంద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.