సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ): బోనాల ఉత్సవాలకు వారం రోజులు ముందుగానే ఆలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ, రెవెన్యూ శాఖల అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుంచి ఆషాఢ బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. 22న గోలొండ బోనాలు, జులై 9న సికింద్రాబాద్ బోనాలు, 16వ తేదీన ఓల్డ్ సిటీ బోనాలు జరుగుతాయని తెలిపారు. బోనాల ఉత్సవాలకు లక్షలాదిమంది వస్తారని, దానిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ పరిధిలో లేని దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు.
26 దేవాలయాలకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు
మన సంసృతిని చాటి చెప్పే బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని పేరొన్నారు. బోనాల సందర్భంగా సుమారు 26 దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి కూడా పట్టువస్ర్తాలను సమర్పిస్తారని, అధికారులు ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని సూచించారు.
ఆలయాల వద్ద త్రీడీ మ్యాపింగ్
గోలొండ కోట, ఓల్డ్ సిటీలోని దమయంతి భవన్, సికింద్రాబాద్లో త్రీ డీ మ్యాపింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని ప్రధాన దేవాలయాల వద్ద సాంసృతిక శాఖ కళాకారులతో పలు సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధాన ఆలయాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బోనాల ఉత్సవాలకు విసృ్తత ప్రచారం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, డీఆర్ఓ సూర్యలత తదితరులు పాల్గొన్నారు.
రూ.15 కోట్లు విడుదల
గత సంవత్సరం జీహెచ్ఎంసీ పరిధిలోని 3039 దేవాలయాలకు ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం కూడా వివిధ ఆలయాలకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలకు వారం ముందే దేవాలయాలకు ఆర్థిక సహాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఆలయ కమిటీల నిర్వాహకులు కూడా వీలైనంత త్వరగా దరఖాస్తులను అధికారులకు అందజేయాలని కోరారు.