కంటోన్మెంట్, అక్టోబర్ 14: పార్టీలో నేతల మధ్య చిన్న చిన్న విబేధాలు ఉన్నా వాటిని వీడాలని, అందరూ కలిసి కట్టుగా పనిచేసి గులాబీ జెండా ఎగురవేయాలని రాష్ట్ర మంత్రి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. శనివారం కార్ఖానాలోని బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన ముఖ్య నేతలు, కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత ఎన్నికల్లో మాదిరిగానే కంటోన్మెంట్లో ఈ సారి కూడా వార్ వన్ సైడేనని, లాస్యనందిత ఘనవిజయాన్ని ఎవరూ ఆపలేరని తేల్చిచెప్పారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న మాదిరిగానే లాస్యనందితకు కూడా ప్రజలంతా సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని గుర్తుచేశారు. కంటోన్మెంట్లో ప్రతినోటా బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత గురించే చర్చ జరుగుతున్నదని, భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు అన్నివర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ గెలుపు కోసం చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై ముఖ్య నేతలతో తలసాని చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నాయకులకు కీలక సూచనలు చేశారు. ప్రతి వార్డులో పది మంది కీలక నాయకులతో ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నాయకులంతా సమిష్టిగా కృషి చేసి, బీఆర్ఎస్ విజయానికి సహకరించాలన్నారు. అనంతరం మంత్రి తలసాని బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత ప్రచార షెడ్యూల్ను వివరించారు.
ఈ నెల 17వ తేదీన బాలంరాయిలోని లీ ప్యాలెస్లో నియోజకవర్గ స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. 18 నుంచి 28వ తేదీ వరకు తొలి విడతగా అన్ని వార్డులలో పాదయాత్ర చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 18న 8వ వార్డు, 19న 7వ వార్డు, 20న 4వ వార్డు, 21న 2వ వార్డు, 22న 6వ వార్డులో ఉదయం పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. 25న 3వ వార్డు, 26న 5వ వార్డు, 27న 1వ వార్డు, 28న మోండా డివిజన్లో లాస్యనందిత పాదయాత్ర ఉంటుందని చెప్పారు. పాదయాత్రలో వెయ్యి మంది తగ్గకుండా ఉండాలని, ప్రతి బస్తీలో ఇంటింటికీ ప్రచారం చేయడంతో పాటు కంటోన్మెంట్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు.
వచ్చే నెల 9న కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా లాస్యనందిత నామినేషన్ వేస్తారని మంత్రి తలసాని వెల్లడించారు. 15వేల మందితో కంటోన్మెంట్లోని దివంగత సాయన్న నివాసం నుంచి భారీ ఊరేగింపుగా లాస్యనందిత నామినేషన్కు వెళ్తారని చెప్పారు. ఈ సమావేశంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నళిని కిరణ్, పాండుయాదవ్, భాగ్యశ్రీ శ్యాంకుమార్, లోకనాథం, మార్కెట్ చైర్పర్సన్ హరిక, వైస్ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, పాలకమండలి సభ్యులు దేవులపల్లి శ్రీనివాస్, భాస్కర్ ముదిరాజ్, రామకృష్ణ, నేతలు టీఎన్ శ్రీనివాస్, జీహెచ్ఎంసీ మాజీ కో-ఆఫ్షన్ సభ్యులు నర్సింహ్మ ముదిరాజ్, మురళీయాదవ్, పనస సంతోష్, అనిల్, విజయ్, శ్రీకాంత్, మల్లేశ్, కిరణ్కుమార్, పెంట శ్రీహరి, సాయికిరణ్, సాంబ ఆశోక్తో పాటు పలు వార్డుల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.