బేగంపేట్ : శాంతి భద్రతల పర్యవేక్షణ, నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర అమోఘమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ( Minister Talasani ) అన్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బుధవారం సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో నూతన సీసీ కెమెరాల (CC Cameras) ఏర్పాటు పై పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటులో దేశంలోనే హైదరాబాద్ నగరం (Hyderabad City) ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గం పరిధిలోని వంద శాతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. నియోజకవర్గం అభివృద్ధి నిధులలో అత్యధిక శాతం సీసీ కెమెరాల ఏర్పాటుకే కేటాయిస్తున్నట్టు వివరించారు.
ఈ సంవత్సరం కూడా మరో రూ.50 లక్షలు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు.ఈ నిధులతో 160 కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలకు సంబంధించి నివేదికలను అందజేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయని అన్నారు. ఈ సమావేశంలో ఉత్తర మండలం డీసీపీ చందనాదీప్తి, ఏసీపీ రవీందర్యాదవ్, రామలింగరాజు, చంద్రశేఖర్,రవికుమార్, సీఐలు పరశురాం, రవి తదితరులు పాల్గొన్నారు.