బేగంపేట్ అక్టోబర్ 14: కోట్లాది రూపాయలతో సనత్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజల కళ్లముందే ఉన్నాయి తాను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తనను అత్యంత భారీ మెజార్టీతో గెలిపిస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ తన ప్రచార కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. శనివారం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నిర్వహించిన సమావేశంలో ఆయన తన ఎన్నికల ప్రచారాల వివరాలను వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ నుంచి నియోజకర్గంలో ఆయన పాదయాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. అంతకు ముందే 16వ తారీఖున నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో జనరల్ బాడీ సమావేశం, అలాగే 18వ తేదీన మారేడ్పల్లిలోని పద్మాశాలి భవనంలో బూత్ లేవల్ కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. నవంబర్ 9వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు.
నామినేషన్కు బన్సీనాల్పేట్ డివిజన్లోని జబ్బార్ కాంప్లెక్స్ నుంచి నామినేషన్ ర్యాలీ ప్రారంభమై బైబిల్హౌజ్, కింగ్స్వే, ప్యాట్నీ మీదుగా మారేడ్పల్లిలోని జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించుకుంటూ వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తామని తెలిపారు. యాభై ఎళ్లుగా జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో తొమ్మిదన్నర ఎళ్లలో చేసి చూపించమన్నారు. ప్రధానంగ ప్రజలకు కావలసిన 24 గంటల కరంటు, నీటి వసతిని కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. సనత్నగర్లో దీర్ఘ కాలికంగా ఉన్న సమస్యలను ఒక్కోక్కటిగా పరిష్కరింప చేసినట్టు తెలిపారు. సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి. వాటిని నిరంతరంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతామని తెలిపారు. ఇప్పటికే మంచినీటి రిజర్వాయర్లు, మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్స్, బస్తీ దవాఖానలు, నాలాల అభివృద్ధి, కమ్యూనిటీ హాల్స్, వైట్ట్యాపింగ్ రోడ్లు, ఆసుపత్రులు, దేవాలయాలు, రోడ్లు, డ్రైనేజీ, సీసివరేజీ,గ్రేవ్యార్డ్ల లాంటి అనేక అభివృద్ధితో పాటు ప్రజలకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించినట్టు తెలిపారు.
తాను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న ఈ తొమ్మదిన్నర ఎళ్ల కాలంతో ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్న విషయం అందరికీ తెలుసునని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం పేదల సంక్షేమ కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో వివిధ సంఘాలు, అసోసియేషన్లు ఏకగ్రీవ తీర్మానాలు , ప్రజలు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పన నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుందన్నారు. అలాగే డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా నిష్పక్షపాతంగా అర్హులైన పేదలకు అందించామని తెలిపారు. నగర వ్యాప్తంగా సుమారు 70 వేల కుటుంబాలకు ఇండ్లను పంపిణీ చేశామన్నారు. ఇండ్లు పంపిణీ చేస్తుంటే ప్రతి పక్షాలు కళ్లప్పగించి చూశాయని అందులో బీజేపీ, కాంగ్రెస్ వారు కూడా ప్రభుత్వం తీసిన డ్రాలో లబ్ధిపొందిన విషయాన్ని తెలిపారు.