బేగంపేట్ మార్చి 14: డివిజన్ల వారీగా ఈ నెల 20 నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశాలను నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. మంగళవారం సనత్నగర్ నియోజకవర్గం కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులతో మారేడ్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ…ఈ నెల 20న మోండామార్కెట్, 23న రాంగోపాల్పేట్, 25న బేగంపేట్, 27న అమీర్పేట్, 29న సనత్నగర్, ఏప్రిల్ 2న బన్సీలాల్పేట్ డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో సంక్షేమ పథకాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఆర్థికంగా ఎంతో వెనుకబడిన దళితులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు అనే కార్యక్రమాన్ని చేపట్టి అర్హులైన నిరుపేద దళితులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 100 మంది చొప్పున పది లక్షలు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. 2వ విడుతలో నియోజకవర్గానికి 1100 మందికి దళిత బంధు ఆర్థిక సహాయం అందించనున్నట్టు చెప్పారు. ఆదేవిధంగా సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి గృహలక్ష్మి కార్యక్రమం కింద రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించే విధంగా ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించినట్టు వివరించారు. దీనికి సంబంధించిన మార్గ దర్శకాలు రానున్నాయని పేర్కొన్నారు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సనత్నగర్ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు జరిగినట్టు తెలిపారు. దీర్ఘ కాలిక సమస్యలు కూడా పరిష్కారమైనట్టు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. అను నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ఆయా డివిజన్లలో నిర్వహించే సమావేశాల సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి సాయికిరణ్యాదవ్, కార్పొరేటర్లు మహేశ్వరి, కొలన్ లక్ష్మీబాల్రెడ్డి, హేమలత, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.