అమీర్పేట్, ఆగస్టు 8 : అందరికీ అందుబాటులో ఉంటూ ఎప్పటి కప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మంత్రులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. గత పాలకులకు, ఇప్పటి పాలకులకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందన్నారు. ఆ మేరకు ప్రజావసరాలకు అనుగుణంగా వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సనత్నగర్, అమీర్పేట్ డివిజన్లలో రూ. 30 లక్షల వ్యయంతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను కార్పొరేటర్లు కొలను లక్ష్మీరెడ్డి, కేతినేని సరళలతో కలిసి ప్రారంభించారు. ముందుగా సనత్నగర్ బస్టాప్ మీదుగా వెళుతున్న ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టం ప్రారంభానికి విచ్చేసిన మంత్రి తలసానికి బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి కొత్త విద్యుత్ దీపాలను ప్రారంభించిన అనంతరం అమీర్పేట్ డివిజన్ బాపూనగర్ చౌరస్తా నుంచి పాత పీఎస్ భవనం వరకు ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ దీపాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను తీసుకుని వస్తే ముఖం చాటేసిన నాయకులను చూసిన సనత్నగర్ నియోజకవర్గం ప్రజలు ఎనిదేండ్లుగా తమ సమస్యలను నేరుగా నా దృష్టికి తీసుకురావడం.. నిర్ణీత గడువుతో తమ సమస్యలు పరిష్కారమవుతున్న ఉదంతాలు ఇప్పుడు ప్రజలకు అనుభవంలోకి వచ్చాయన్నారు.