‘తెలంగాణ ఏర్పాటైన తర్వాత హైదరాబాద్ ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందింది. అంతర్జాతీయ పెట్టుబడులు, వరల్డ్ క్లాస్ కంపెనీలతో నగర ఖ్యాతి మరింత పెరిగింది. ఎస్ఆర్డీపీతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అందుబాటులోకి వచ్చాయి. ఎస్ఎన్డీతో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే నగరంలో 70% మేర వరద ముప్పు తగ్గింది’ అని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన ‘మీట్ ద ప్రెస్’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని హైదరాబాద్ అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, మహానగరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంపై మాట్లాడారు. హైదరాబాద్ నవనిర్మాణంలో మంత్రి కేటీఆర్ పాత్ర కీలకమన్నారు. స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రాజెక్టు, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్టులు ఆయన పనితీరుకు నిదర్శనంగా నిలిచాయన్నారు. మెరుగైన మౌలిక వసతులు, అంతకు మించిన శాంతిభద్రతలు, సామాజిక భద్రతను నిచ్చే సంక్షేమ పథకాలతో పాటు పేదోడి సొంతింటి కలను సాకారం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తర్వాత నగరంలో మరో లక్ష ఇండ్ల నిర్మాణం చేపడతామని మంత్రి స్పష్టం చేశారు.
– సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, నవంబర్ 3(నమస్తే తెలంగాణ): “హైదరాబాద్.. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్నది. ట్రాఫిక్ రహిత రవాణా సదుపాయాల కోసం చేపట్టిన ఎస్ఆర్డీపీతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అందుబాటులోకి వచ్చాయి. లోతట్టు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చేపట్టిన ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు అద్భుతమైన ఫలితాలనిస్తున్నది. ఇప్పటికే నగరంలో 70శాతం మేర వరద ముంపు తగ్గింది”అని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత హైదరాబాద్ ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందిందన్నారు. అంతర్జాతీయ పెట్టుబడులు, వరల్డ్ క్లాస్ కంపెనీలతో హైదరాబాద్ ఖ్యాతి మరింత పెరుగుతుండగా, భూములకు భారీ డిమాండ్ వస్తుందన్నారు.
సీఎం కేసీఆర్ విజనరీతో రూపొందించిన పథకాలను కేటీఆర్ సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. 60ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ హయాంలోనూ తెలంగాణ ప్రాంతానికి అన్యాయమే జరిగిందన్నారు. అయినా మొక్కవోని దీక్షతో తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నామని, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా, ఉపాధినిచ్చే కేంద్రంగా నిలిచిందన్నారు. గొప్పలు చెప్పుకునే బీజేపీ చేపట్టిన ఒక్క ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేదన్నారు. అంబర్పేట్ నుంచి ఉప్పల్ వరకు చేపట్టిన ఫ్లై ఓవర్ ఇంకా నిర్మాణంలోనే ఉన్నదని, దీనికి కిషన్ రెడ్డి సమాధానం చెప్పుకోవాలన్నారు. అంబర్పేట్ ఫ్లైఓవర్ శంకుస్థాపన తర్వాత మొదలుపెట్టిన ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతోపాటు సౌకర్యవంతమైన రోడ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. 9ఏళ్లలో 45 ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేసి రవాణా సౌలతులను అభివృద్ధి చేశామన్నారు. లింకు రోడ్లు, ఫ్లైఓవర్లను నిర్మించిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు.
గ్రేటర్లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి కలల సౌధాలను నిర్మించిందన్నారు. లక్ష ఇండ్లు నిర్మించగా ఇప్పటికే 70వేల ఇండ్ల పంపిణీ పూర్తి చేశామన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తర్వాత మరో లక్ష ఇండ్లను గ్రేటర్ పరిధిలో నిర్మిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన ఇండ్లకు 70శాతం లబ్ధిదారులు చెల్లించేవారని, కానీ ఇక్కడ డబుల్ బెడ్రూం ఇంటితోపాటు లిఫ్టులు, వాటర్ ఫెసిలిటీల కోసం రూపాయి కూడా లబ్ధిదారుల నుంచి వసూలు చేయలేదన్నారు. నిర్మాణం నుంచి పంపిణీ వరకు పకడ్బందీగా చేపట్టామని, అర్హులైన వారికే పంపిణీ చేశామన్నారు.
సంక్షేమ పథకాలు అందని వారికి కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ భవిష్యత్తులో ప్రభుత్వ ఫలాలు ప్రతి ఒక్క అర్హుడికి చేరుతాయన్నారు. కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకే డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తున్నారని పనికిరాని ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎంపికైన లబ్ధిదారులలో అన్ని పార్టీలకు చెందిన వారు ఉన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఒకవేళ అనర్హత కలిగిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు దక్కితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టులు కీలకపాత్రను పోషించారని, ఇవాళ సుపరిపాలన అందించడంలో జర్నలిస్టుల భాగస్వామ్యం అవసరమని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పంపిణీ జరుగుతుందన్నారు.
హైదరాబాద్ అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, మహానగరంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం, ప్రతిపక్షాల తీరుపై స్పందించారు. కేటీఆర్ సారథ్యంలో హైదరాబాద్ నవనిర్మాణం జరిగిందన్నారు. ఆయన పనితీరుకు నిదర్శనంగా నిలిచేలా స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్ మెంట్ ప్రాజెక్టు, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్టులు మారాయన్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు రూపకల్పన చేసి హైదరాబాద్ నగరంలో మెరుగైన రవాణా సదుపాయాలు, వరద ముంపును తగ్గించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. నగరంలో ఎటు చూసినా.. అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, ఎక్స్ప్రెస్వేలతో రూపురేఖలే మారిపోయాయని చెప్పారు.
ఐటీ, ఐటీయేతర రంగాల్లో పెట్టుబడులతో వేలాది మందికి జీవనోపాధి కల్పించే కేంద్రంగా హైదరాబాద్ నిలిచిందన్నారు. నగరానికి నలువైపులా నిర్మిస్తున్న టిమ్స్ లాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లలో ప్రభుత్వ వైద్యం కార్పొరేట్కు దీటుగా ఉంటుందన్నారు. మెరుగైన మౌలిక వసతులు, అంతకు మించిన శాంతిభద్రతలు, సామాజిక భద్రతను నిచ్చే సంక్షేమ పథకాలతోపాటు, రూపాయి ఖర్చు లేకుండా.. అవినీతికి తావు లేకుండా పేదోడి సొంతింటి కలలను సాకారం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత అన్ని వర్గాలు, కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా బీఆర్ఎస్ వెంటనే ఉన్నారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్కు ఎవరూ దూరం కాదన్నారు. సెటిలర్లను కంటికి రెప్పలా.. ప్రభుత్వం కాపాడుకుందని వ్యాఖ్యానించారు. ఇక అక్కడ జరుగుతున్న అంశాల ప్రభావం హైదరాబాద్లో ఉన్న ఓటర్లపై ప్రభావం ఉండదని తెలిపారు. వారంతా తమతోనే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.