కంటోన్మెంట్, నవంబర్ 25 : గులాబీ పార్టీతోనే కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. లాస్యనందితకు భారీ మెజార్టీ వస్తుందని, అయినా గులాబీశ్రేణులు అలసత్వం లేకుండా మరింత కృషి చేయాలని కోరారు. విపక్షాల మాయమాటలను ప్రజలెవ్వరూ నమ్మడం లేదన్నారు. ప్రజలందరి దీవెనలతో గెలిచేది తామేనని.. పనులు చేసేది కూడా తామేనని వెల్లడించారు. శనివారం కంటోన్మెంట్ నియోజకవర్గం ఎన్నికలపై బోయిన్పల్లిలోని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ముఖ్యనాయకులకు మంత్రి తలసాని కీలక సూచనలు చేశారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న చొరవతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయన్నారు. సాయన్న కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లాస్యనందితను సొంతబిడ్డగా భావించి, మద్దతు పలకాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ల కాలం చెల్లిందని, ఎన్నికల్లో విజయఢంకా మోగించేది బీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. ఈ సందర్భంగా టీఎమ్మార్పీఎస్తో పాటు మాల సంఘాల జేఏసీ నేతలు తలసానిని కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సమావేశంలో ఎన్నికల ఇన్చార్జిలు ఎంఎన్ శ్రీనివాస్, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, కట్టెల శ్రీనివాస్ యాదవ్, బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నళిని కిరణ్, పాండు యాదవ్, భాగ్యశ్రీ శ్యాంకుమార్, లోకనాథం, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరి, సీనియర్ నాయకులు నివేదిత, ఆకుల హరి, టీఎన్ శ్రీనివాస్, నర్సింహ్మ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.