సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : పేదవారి సొంతింటి కల నెరవేర్చుకునేందుకు సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆన్లైన్ లాటరీ పద్ధతిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. రాండమైజేషన్ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్ డ్రా విధానం నిర్వహించారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో మొదటి విడుతగా 7500 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించామన్నారు. ఆన్లైన్ లాటరీ విధానం ఎన్నో రెట్లు మెరుగైందని, పారదర్శకంగా, జవాబుదారీ తనాన్ని సూచిస్తుందన్నారు. అయితే ఈ ప్రక్రియలో జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్ ప్రధాన పాత్ర పోషించారని ఈ సందర్భంగా మంత్రి వారికి అభినందనలు తెలిపారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరిగిందన్నారు. ఇది ఇండియాలోనే మొదటి సారి కావడంతో ఇండ్ల కేటాయింపును ఆన్లైన్ లాటరీ విధానంలో కేటాయించి పారదర్శకత పాటించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఎన్ఐసీ సహకారంతో రాండమైజేషన్ సాఫ్ట్వేర్ ద్వారా ప్రజా ప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక చేశామని పేర్కొన్నారు. ఈ కేటాయింపులో ఎవరి జోక్యం లేకుండా సాఫ్ట్వేర్తోనే ఇండ్ల కేటాయింపు ప్రక్రియ చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఆర్వో వెంకటాచారి, ఎన్ఐసీ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.