మారేడ్పల్లి, జూన్ 18 : తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి నాణ్యమైన తాగునీటిని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వెస్ట్ మారేడ్పల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో జరిగిన ‘మంచినీళ్ల పండుగ’ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు.
గత ప్రభుత్వాల హయంలో నీళ్ల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని, ముఖ్యంగా వేసవి కాలంలో వాటర్ వర్క్స్ కార్యాలయాల ముందు బిందెలతో ప్రజలు ధర్నాకు దిగే వారని తెలిపారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అలాంటి పరిస్థితి లేదని., గ్రామీణ ప్రాంతాల్లోని తండాలకు, గుడాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందజేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్లో హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు.. రూ.13,546 కోట్లతో నూతనంగా అదనపు పైప్లైన్లు, రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. కృష్ణా, గోదావరి జలాలను తీసుకొచ్చి రోజు రోజుకు విస్తరిస్తున్న నగర ప్రజలకు రానున్న 50 సంవత్సరాల పాటు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో నగరంలో 8.15 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం 13.17 లక్షలకు పెరిగాయని చెప్పారు. నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటి సరఫరా కార్యక్రమం కింద 62శాతం మంది ప్రజలు లబ్ధిపొందుతున్నారని, ఇందుకోసం రూ.815 కోట్లు ప్రభుత్వం భరిస్తున్నదని చెప్పారు. ప్రస్తుతం కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 24 గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలకు ప్రతి రోజు 602 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రజల అవసరాల గురించి ఎంతో దూర దృష్టితో ఆలోచిస్తారనేందుకు ఇదే నిదర్శనమన్నారు.
నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి నిరంతరం నీటి సరఫరా జరిగే విధంగా సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగిందని, పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రూ.3800 కోట్ల వ్యయంతో మురుగు నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నామని వివరించారు. ఈ సందర్భంగా పలువురు జలమండలి ఉద్యోగులు, సిబ్బందిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఎండీ దానకిశోర్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి తలసాని సాయికిరణ్యాదవ్, కార్పొరేటర్లు కొంతం దీపిక, కొలన్ లక్ష్మి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్లు ఆకుల రూప, నామన శేషుకుమారి, అత్తిలి అరుణ, లాస్యనందిత, బీఆర్ఎస్ నాయకులు నివేదిత పీఎల్. శ్రీనివాస్, వాటర్ వర్క్స్ సీజీఎం ప్రభు, డీజీఎం శశాంక్, ఏఈలు వెంకట్రావ్, సంధ్య, సురేశ్, తదితరులు పాల్గొన్నారు.