మారేడ్పల్లి, జూలై 8: బోనాల ఉత్సవాలను ప్రజలందరూ ఘనంగా జరుపుకొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం కంటోన్మెంట్ ఐదో వార్డు మహాత్మా గాంధీనగర్ బస్తీలోని నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయం ముఖ ద్వారం, గోపురాన్ని కార్పొరేషన్ చైర్మన్లు గజ్జెల నాగేశ్, మన్నె క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డిలతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.
అనంతరం బస్తీ వాసులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్లను శాలువాతో ఘనంగా సత్కరించారు. కాగా, నల్ల పోచమ్మ ఆలయ అభివృద్ధి కోసం మల్కాజ్గిరి పార్లమెంట్ , కంటోన్మెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి 50 వేల రూపాయలను ఆలయ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని మర్రి రాజశేఖర్రెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ బోర్డు సభ్యులు పాండుయాదవ్, నళినీ కిరణ్, ప్రముఖ సామాజిక వేత్త తేలుకుంట సతీశ్ గుప్తా, బీఆర్ఎస్ నాయకులు పెద్దాల నర్సింహ, ముప్పిడి మధుకర్, కృష్ణయాదవ్, ప్రవీణ్ యాదవ్, మల్లప్ప, నాగరాజు, గంట రాజు తదితరులు పాల్గొన్నారు.