హైదరాబాద్ : రెండో దశ మెట్రో రైలు నిర్మాణ పనులకు ఈ నెల 9వ తేదీన సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నాయకులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. మెట్రో రెండో దశలో భాగంగా మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు రూ. 6,250 కోట్ల వ్యయంతో 31 కిలో మీటర్ల మేర మెట్రో లైన్ను ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. ఈ పనులకు మైండ్ స్పేస్ వద్ద సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. అనంతరం రాజేంద్రనగర్లోని తెలంగాణ పోలీస్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. నగరంలోని అన్ని నియోజకవర్గాల నుండి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మైండ్ స్పేస్ జంక్షన్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 31 కిలో మీటర్ల మేర నిర్మించనున్న రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ ప్రాజెక్టు విమానయాన ప్రయాణీకులు, ఐటీ కారిడార్, ఇంకా అనేకమందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ప్రభాకర్ రావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, సాయన్న, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, నియోజకవర్గ ఇంచార్జిలు ఆనంద్ గౌడ్, ప్రేం సింగ్ రాథోడ్, నంద కిషోర్ వ్యాస్, శ్యాం సుందర్ రెడ్డి, సలా ఉద్దిన్ లోది, జీవన్ సింగ్, బక్రీ, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.