హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని ఆయా నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రతిపాదనలను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. మసాబ్ ట్యాంకులోని తన కార్యాలయంలో మంత్రి తలసాని పలువురు ఎమ్మెల్యేలతో బుధవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని స్పష్టం చేశారు. నిధులతో నియోజకవర్గాల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు పలు అభివృద్ధి పనులను చేపట్టామని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులకు అదనంగా పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులతో పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో ఆసరా పెన్షన్ల పంపిణీ, దళిత బందు పథకం అమలు, రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ, సీవరేజ్ సమస్యల పరిష్కారం, నియోజకవర్గాలలో అభివృద్ధి పనుల కోసం నిధుల కేటాయింపు తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, సాయన్నతో పాటు హైదరాబాద్ జిల్లా ప్లానింగ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.