హైదరాబాద్ : భూమి, ఆకాశం ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన గొప్ప నాయకులు ఎన్టీఆర్ అని ఆయన స్పష్టం చేశారు. శనివారం ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఘననివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక గొప్ప నటుడుగా, ప్రజానాయకుడుగా ఎందరో అభిమానులను తన సొంతం చేసుకొన్నారని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు ఎంతో అభిమానంతో అన్నగారు అని పిలుచుకొనే నందమూరి తారక రామారావు సామాజిక, పౌరాణికం తదితర పాత్రలతో తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 పైగా చిత్రాలలో నటించారని గుర్తు చేశారు. అనేక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారని తెలిపారు. రాముడు, భీముడు, కృష్ణుడు, కర్ణుడు వంటి అనేక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలచిపోయాడని అన్నారు. ఒక రాజకీయ పార్టీని స్థాపించి అతి తక్కువ సమయంలో కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారంటే అది ఆయనకు ప్రజలలో ఉన్న ఆదరణకు నిదర్శనంగా మంత్రి తలసాని పేర్కొన్నారు.