Minister Srinivas Yadav | పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతోనే వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఉచితంగా అందజేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో రెండో విడతలో భాగంగా ర్యాండమైజేషన్ సాఫ్ట్వేర్ విధానం ద్వారా ఆన్లైన్ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆన్లైన్ లాటరీ ద్వారా డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించారు.
కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, ముఠా గోపాల్, ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీలు ప్రభాకర్, వాణీదేవి, మీర్జా రహమత్ బేగ్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రంగారెడ్డి కలెక్టర్ హరీశ్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్ సమక్షంలో కార్యక్రమం సాగింది.
జీచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో రెండో విడతగా 11,700 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. రెండో విడత ప్రక్రియలో దివ్యాంగులు, ఎస్సీ-ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించామన్నారు. దివ్యాంగులకు 470, ఎస్సీలకు 1,923, ఎస్టీలకు ఎస్టీలకు 655 కేటాయించగా.. ఇతరులకు 8,652 కేటాయించినట్లు వివరించారు.
కేటాయింపుల్లో ఎవరి జోక్యం లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు గొప్పగా బతకాలనే ఉద్దేశంతో డిమాండ్ ఉన్న ఏరియాల్లో ఇల్లు కట్టించి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఆర్డీఓ వెంకటాచారి, హైదరాబాద్ ఆర్టీవోలు సూర్యప్రకాశ్, రవికుమార్, ఎన్ఐసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.