హైదరాబాద్: పాతబస్తిలో బోనాల జాతర ఘనంగా జరుగుతున్నది. కార్వాన్లోని దర్బార్ మైసమ్మ అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సింహవాహిని మహంకాళి అమ్మవారికి, ఇతర ఆలయాల్లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. మహంకాళికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. కాగా, ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.