నిపుణుల బృందాన్ని పంపిన కేంద్రం
తిరువనంతపురం, జూలై 9: కరోనా సంక్షోభం పూర్తిగా తొలిగిపోకముందే కేరళలో జికా కేసులు వస్తుండటం ఆందోళనను మరింత పెంచుతున్నది. తిరువనంతపురంలో ఇప్పటివరకు 15 మందికి జికా వైరస్ సోకినట్టు పరీక్షల్లో తేలింది. వైరస్ నిర్ధారణ అయినవారిలో 24 ఏండ్ల గర్భిణి కూడా ఉన్నారు. ఈ ఏడాది కేరళలో జికా సోకిన మొదటి వ్యక్తి ఆమేనని అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కేరళ చేపడుతున్న నియంత్రణ చర్యలకు మద్దతుగా కేంద్రం ఆరుగురు సభ్యులతో కూడిన బృందాన్ని పంపించింది. ఈ నేపథ్యంలో జికా వైరస్ వ్యాపిస్తుంది, లక్షణాలు, నివారణకు ఏం చేయాలి అన్న వివరాలు..
ఎలా వ్యాపిస్తుంది?
ఏడిస్ ఈజిప్టి అనే దోమ కుట్టడం వల్ల ఈ వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తితో శృంగారం చేస్తే కూడా సోకుతుంది. గర్భిణి నుంచి కడుపులో బిడ్డకు కూడా సోకే అవకాశం ఉన్నట్టు అమెరికా సీడీసీ తెలిపింది.
లక్షణాలు ఏంటి?
జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కీళ్ల నొప్పులు, కండ్లు ఎర్రబడటం, కండరాల నొప్పి. చాలా మందిలో లక్షణాలు కనిపించవు. లేదా కొన్ని లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. లక్షణాలు వారం రోజుల దాకా ఉంటాయి. జికా వైరస్ సోకినవారికి సాధారణ వైద్యంతోనే నయం అవుతుంది. దవాఖానకు వెళ్లే అవసరం చాలా తక్కువ.
మరి ప్రమాదం ఎవరికి?
జికా వైరస్ ప్రభావం సాధారణ వ్యక్తులపై అంతగా ఉండదు. గర్భిణిలకు సోకినప్పుడు మాత్రం బిడ్డ ఆరోగ్యంపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఎక్కువ. మెదడులో పెరుగుదల లోపించడం, బిడ్డ తల చిన్నగా మారడం లాంటివి సంభవించవచ్చు. గర్భస్రావం జరిగే ప్రమాదం కూడా ఉంది.
నివారణ ఎలా?
జికా వైరస్కు టీకా లేదు. దోమలను నివారించడమే మార్గం. ఇంట్లో దోమతెరలు వాడటం ఉత్తమం. చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఈ వైరస్ సోకితే నిర్దిష్ట చికిత్స విధానం లేదు. లక్షణాలను బట్టి మందులు ఇస్తారు.