సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ): డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో బీజేపీ నాయకులు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. గురువారం ఆదర్శ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లోని తన కార్యాలయంలో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రిగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డికి అధికారికంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించే అవకాశం ఉన్నా రోడ్డుపై బైఠాయించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించిన తర్వాత కూడా ఆందోళన ఎందుకు చేస్తున్నారో చెప్పాలని అన్నారు. పేదలకు మేలు చేయాలనే ఆలోచన ఉంటే కేంద్రం నుంచి ఎందుకు నిధులు తేలేకపోతున్నారని మంత్రి తలసాని ప్రశ్నించారు. దేశంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షల ఇండ్లను, జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని ఐడీహెచ్ కాలనీలోనే మొట్టమొదటగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించినట్లు చెప్పారు. ఇప్పటికే సనత్ నగర్, కార్వాన్, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ తదితర నియోజకవర్గాలలో ఇండ్లను నిర్మించామని, కొల్లూరులో రూ. 6,700 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీని ఇటీవలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని మంత్రి తలసాని గుర్తు చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారని చెప్పారు. సొంత స్థలం ఉన్న వారికి త్వరలోనే గృహలక్ష్మి పథకం అమలు చేస్తామని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రశంసించిన విషయం వాస్తవం కాదా ? అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకే రోడ్డుపై అర్ధం లేని ఆందోళన చేపట్టారని విమర్శించారు.
ఓఆర్ఆర్పై బీజేపీ హైడ్రామా కిషన్రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
చలో బాటసింగారం పిలుపులో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలోని ఓఆర్ఆర్పై కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డిని గురువారం రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కిషన్రెడ్డితో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు, రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. అనుమతి లేని పర్యటనకు వెళ్లిన కిషన్ రెడ్డి కాన్వాయ్ను పోలీసులు అడ్డుకోగా వాగ్వాదం నెలకొన్నది. అంత వర్షంలోనూ పోలీసులు సామరస్యంగా మాట్లాడుతూ కేంద్రమంత్రి పర్యటనకు అనుమతి లేదంటూ నచ్చజెప్పారు. ఎంత నచ్చజెప్పినా కిషన్ రెడ్డి రోడ్డపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో చేసేదేమిలేక పోలీసులు వారిని అరెస్ట్ చేసి బీజేపీ ఆఫీసుకు తరలించారు.
అర్థం లేని ఆందోళన
కేంద్ర మంత్రిగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతాయుతమైన పదవులలో ఉన్న కిషన్ రెడ్డికి అధికారికంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించి పరిశీలించే అవకాశం ఉన్నది. అయినప్పటికీ అర్థం లేని ఆందోళన చేపట్టారు. తగలపడుతున్న మణిపూర్ను వదిలిపెట్టి రాష్ట్రంలో నీచ రాజకీయ నాటకాలకు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకే డ్రామాలు చేస్తున్నారు. పేదలపై కిషన్రెడ్డికి ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. ఉప్పల్-నారపల్లి, అంబర్పేట ఫ్లైఓవర్లను వెంటనే పూర్తి చేయించాలి.
– టీఎస్టీఎస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ రావు