సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ ) /కవాడిగూడ/చిక్కడపల్లి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిండుకుండలా మారిన హుస్సేన్ సాగర్ను శనివారం పరిశీలించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి, ఇంజినీర్ ఇన్ చీఫ్ జియా ఉద్దీన్, లేక్ సీఈ సురేశ్ కుమార్, జోనల్ కమిషనర్ రవి కిరణ్ తదితరులతో కలిసి హుస్సేన్సాగర్ ఎఫ్టీఎల్తో పాటు నీటి విడుదలను హోటల్ మారియెట్ నుంచి మంత్రి తలసాని పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు 428 ఎమర్జెన్సీ బృందాలు 24 గంటలు పని చేస్తున్నాయని చెప్పారు. జీహెచ్ఎంసీ, పోలీస్, డీఆర్ఎఫ్ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు సమన్వయంతో పని చేయడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు. చిన్న, చిన్న సమస్యలు ఎదురైనా తక్షణమే ఈ బృందాలు పరిషరిస్తున్నట్లు మంత్రి పేరొన్నారు. సమస్యలను పరిషరించేందుకు 24 గంటల పాటు పని చేసేలా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, ఈవీడీఎం బుద్ధ భవన్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ముంపు తప్పింది
వరదతో ప్రజలు ఇబ్బందులు పడకుండా మంత్రి కేటీఆర్ నాలాల అభివృద్ధి కోసం ఎస్ఎన్డీపీ కార్యక్రమాలు చేపట్టారని, ఈ పనుల వల్ల చాలా ప్రాంతాల్లో వరద ముప్పు తప్పిందని మంత్రి తలసాని వివరించారు. వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారన్నారు. కొన్ని ప్రాంతాల్లో నాలాలపై అక్రమ నిర్మాణాలు ఉండడం మూలంగా ముంపు ఏర్పడిందని చెప్పారు. ఆ ప్రాంతంలో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ బృందాలు డీఆర్ఎఫ్, పోలీస్ శాఖ అహర్నిశలు కష్టపడుతూ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నాయని ప్రశంసించారు.
వర్షాలు తగ్గిన తర్వాత నాలా ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రసూల్ పుర, మినిస్టర్ రోడ్, ముషీరాబాద్లలో నిర్మించిన బ్రిడ్జిల వల్ల అనేక ప్రాంతాలు జలమయం కాలేదని వివరించారు. ఎస్ఎన్డీపీ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఇంకా రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే.. కంట్రోల్ రూమ్కు తెలియజేయాలని నగరవాసులకు సూచించారు. అనంతరం మంత్రి తలసాని హుస్సేన్సాగర్ కాలువ నీటి ఉధృతిని కవాడిగూడ (భాగ్య లక్ష్మి టెంపుల్) , అశోక్ నగర్ వద్ద పరిశీలించారు.