హైదరాబాద్ : నిరుపేదలందరికీ అన్ని వసతులతో విశాలమైన డబుల్ బెడ్రూంలు నిర్మించి ఇవ్వాలనేదే సీఎం కేసీఆర్ ఆలోచన అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మారావునగర్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి హమాలీ బస్తీవాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హమాలీ బస్తీలో త్వరలో చేపట్టనున్న డబుల్ బెడ్రూం ఇండ్ల అర్హులైన లబ్ధిదారల జాబితాను ఈ నెల ౩౦న బస్తీలో అధికారులు ప్రదర్శిస్తారని పేర్కొన్నారు.
ఆ జాబితాలో అర్హులైన వారి పేర్లు లేకున్నా, అనర్హుల పేర్లు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అర్హుల పేర్లు లేకుంటే తగు విచారణ జరిపి జాబితాలో పేరు చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇరుకైన ఇండ్లలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు సక్రమంగా లేక పడుతున్న అవస్థలు ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు.
ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్న వారిలో అంతా పేదలేనని పేర్కొన్నారు. మీకు ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఇండ్లను నిర్మించి ఇస్తుందన్నారు. ఇప్పటికే బన్సీలాల్పేటలోని పలు ప్రాంతాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వడం జరిగిందని, లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారని వివరించారు. సమావేశంలో కార్పొరేటర్ హేమలత, నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, ఆర్డీవో వసంత, హౌసింగ్ ఈఈ వెంకటదాసురెడ్డి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.