Minister Srinivas Yadav | ఎన్నో సంవత్సరాల తమ కలను సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని జీరాకాలనీలో లీజు ల్యాండ్లో ఇండ్లు నిర్మించుకొని నివసిస్తున్న 134 ఇండ్ల స్థలాలను ఫ్రీ హోల్డ్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీని కాలనీ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1934 సంవత్సరంలో ఏర్పడిన జీరా కాలనీ వాసుల కలను మనసున్న మహారాజు సీఎం కేసీఆర్ అని, పెద్ద మనసుతో ప్రజల కలను సాకారం చేశారన్నారు.
జీరా కాలనీ స్థలాలను ఫ్రీ హోల్డ్ చేయాలనే ఎన్నో సంవత్సరాల కోరికను అంగీకరించారన్నారు. గత ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులకు తమ సమస్యను విన్నవించినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. కాలనీ ప్రజల సమస్యను సీఎం కేసీఆర్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఉదార స్వభావం కలిగిన సీఎం కేసీఆర్ జీరాకాలనీ వాసుల సమస్యను అర్థం చేసుకొని పెద్ద మనసుతో జీవో 816 ప్రకారం.. ఫ్రీ హోల్డ్ చేసేందుకు అంగీకరించారని తెలిపారు.
కాలనీ ప్రతినిధులు మాట్లాడుతూ సుమారు 38సంవత్సరాల నుంచి తమ స్థలాలను ఫ్రీ హోల్డ్ చేయాలని అనేక ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులకు విన్నవిస్తూ ఉన్నా ఎవరూ కూడా పట్టించుకోలేదని అన్నారు. 1994 వ సంవత్సరంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 816 క్రింద ఫ్రీ హోల్డ్ చేయాలని దరఖాస్తు చేసుకున్నప్పటికీ, కోర్టు కేసుల కారణంగా పెండింగ్లో ఉంచారన్నారు. 2002లో కోర్టు తీర్పు అనుకూలంగా ఉన్నప్పటికీ గడువు ముగిసిందనే కారణంతో జీవో 816 అమలుకు నోచుకోలేదని అన్నారు.
తమ సొంత ఇంటి కల.. కలగానే మిగిలిపోనున్నదా? అనే నైరాశ్యంతో ఉన్న తమకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారం, కృషితో కల నెరవేరిందని ప్రత్యేక అభినందనలను తెలిపారు. తమ సమస్యను అనేక సార్లు ముఖ్యమంత్రి, మున్సిపల్శాఖ మంత్రిల దృష్టికి తీసుకెళ్లి జీవో 816 ప్రకారం.. ఫ్రీ హోల్డ్ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేయించారని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాల కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్లకు వారు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జీరా కాలనీ అధ్యక్షుడు మాడపు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ యాదవ్, ఉపాధ్యక్షులు విజయ్ షా, కోశాధికారి రాజన్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.