హైదరాబాద్ : పేదల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని బంజారాహిల్స్ శ్రీరామ్నగర్లో రూ.2కోట్ల వ్యయంతో నిర్మించనున్న మల్టీపర్పస్ కమ్యూటీ హాల్, బస్తీ దవాఖాన భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలనీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నూతనంగా నిర్మించున్న భవనంలో ఫంక్షన్ హాలు, బస్తీ దవాఖానాతో పాటు అంగన్వాడీ కేంద్రం ఉండేలా చూడాలని, ప్లేగ్రౌండ్ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గత 40-50 సంవత్సరాల నుంచి కాలనీ ప్రజలు అభివృద్ధి పనులు చేపట్టాలని కోరినా.. ఎవరూ పట్టించుకోలేదన్నారు.
మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం కృషితో అభివృద్ధి పనులు మంజూరయ్యయాన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. బస్తీల్లో అవసరమైన అన్ని రకాల సదుపాయాలు, వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో నగరంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి, ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు నిర్మిస్తున్నారన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని బీఎస్ మక్తా, దీన్దయాల్ నగర్, గౌరీ శంకర్ నగర్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ తదితర ప్రాంతాల్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ రజనీకాంత్ రెడ్డి, ఈఈ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.