బేగంపేట్ నవంబర్ 9: రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని…మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం సికింద్రాబాద్ మారేపడ్పల్లిలోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఆయన తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. తొలుత వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో మంత్రి తలసాని వివిధ ఆలయాల పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం, అనంతరం తన తల్లి లలితాబాయి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
తర్వాత బన్సీలాల్పేట్లోని జబ్బార్ కాంప్లెక్స్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్రాం విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం తలసాని శ్రీనివాస్యాదవ్ వేలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా వెళ్లి మారేడ్పల్లిలోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాగా, అంతకుముందు మంత్రి తలసాని నామినేషన్ వేసేందుకు ర్యాలీగా తరలివెళ్లారు. జబ్బార్ కాంప్లెక్స్ నుంచి ప్రారంభమైన ర్యాలీ సిటీలైట్ హోటల్, బాటా, ప్యాట్నీ హరిహార కళాభవన్ల మీదుగా నార్త్జోన్ జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపడుచులకు పెండ్లికి లక్ష నూట పదహార్లు ఆర్థిక సహాయం, ఆసరా పథకంలో ప్రతి నెలా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. దళిత బంధు, బీసీ బంధు, ఇండ్లు లేని వారికి ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇవ్వడం వంటి అనేక కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 70 వేల మంది అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లను ఇచ్చినట్లు పేర్కొన్నారు.