హైదరాబాద్: పేద ప్రజల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కార్ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని చెప్పారు. సికింద్రాబాద్లోని డీఆర్డీవో కార్యాలయంలో కొత్తగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు మంత్రి తలసాని పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు రూ.2 వందలుగా ఉన్న పెన్షన్ ను సీఎం కేసీఆర్ రూ.2016కు పెంచారన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయని చెప్పారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 15 నుంచి 57 ఏండ్లు దాటిన మరో 10 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపడుచు పెండ్లికి లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని చెప్పారు.