బంజారాహిల్స్,జూన్ 8 : రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడం ద్వారా రాష్ర్టాన్ని సస్యశ్యామలంగా మార్చిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ‘ఊరూరా చెరువుల పండుగ’ కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని లోటస్పాండ్ వద్ద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాకతీయుల కాలంలో నిర్మించిన వేలాది చెరువులు 2014కంటే ముందు సరైన నిర్వహణ, పర్యవేక్షణ లేకపోవడంతో శిథిలమైపోయాయన్నారు. అయితే సీఎం కేసీఆర్ దూరదృష్టితో మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని చెరువుల్లో పూడికతీయడంతో పాటు మరమ్మతులు చేయించడంతో సాగునీటి సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యాయన్నారు. వేసవి కాలంలో కూడా అనేక చెరువులు మత్తడి దూకుతున్నాయంటే దానికి కారణం మిషన్ కాకతీయ కార్యక్రమమేనని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 185 చెరువులు ఉన్నాయని, గతంలో వీటిలో చాలా భాగంగా మురికి కూపంగా మారగా తెలంగాణ ఏర్పడిన తర్వాత వీటిని అభివృద్ధి చేయడంతో నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయన్నారు. మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ..తెలంగాణ ఏర్పడకముందు నగరంలోని చెరువులు ఆక్రమణలకు గురై దుర్గంధం వెదజల్లుతుండేవన్నారు.
రాష్ట్రం ఏర్పాటు తర్వాత చెరువుల్లో పూడికతీత, సుందరీకరణ పనుల కోసం రూ.341 కోట్ల వ్యయంతో పనులు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 191 పనులు పూర్తి కాగా మరో 144 పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా లోటస్పాండ్ చెరువు వద్ద మహిళలు బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. వారితో కలిసి మేయర్ కూడా బతుకమ్మ ఆడారు.ఈ కార్యక్రమంలో నీటిపారుదలశాఖ లేక్స్ విభాగం సీఈ సురేశ్, ఇరిగేషన్ సీఈ ధర్మ, ఎస్ఈ కేఎన్.ఆనంద్, ఈఈ శంకరరావు, డీఈ శశికళ, డీఈ ప్రవీణ్. ఫిషరీస్జిల్లా అధికారి సుచరితతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ ప్రసన్న రామ్మూర్తి, కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, సంగీతాయాదవ్, వెల్దండ వెంకటేశ్, జోనల్ కమిషనర్ రవికిరణ్, జలమండలి జీఎం హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.