హైదరాబాద్ : క్రిస్టియన్ మైనారిటీలతో పాటు అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నారాయణగూడ చర్చిలో యునైటెడ్ క్రిస్టియన్ అండ్ పాస్టర్స్ సమావేశంలో మంత్రి పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐక్యతతోనే అభివృద్ధి సాధించగలం అనే విషయాన్ని గుర్తించి రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనార్టీలు అంతా ఒకటి కావాల్సిన అవసరం ఉందన్నారు.
అన్ని జిల్లాలు, మండలాలవారీగా కమిటీలను ఏర్పాటు చేసుకొంటే సమస్యలను పరిష్కరించుకొనే అవకాశం ఉంటుందని, ఈ కమిటీల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన వారికి అందించవచ్చన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా అమలుకావడం లేదన్నారు. క్రిస్టియన్ల ఆత్మగౌరవాన్ని మరింత పెంపొందించే విధంగా ఉప్పల్ భగాయత్లో రెండెకరాలు, రూ.10కోట్ల క్రిస్టియన్ భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొన్నారు. పేదింటి ఆడపడుచు పెండ్లి కోసం షాదీ ముబారక్ కిందట రూ.1,00,116 ఆర్థిక సహాయం, విదేశాల్లో ఉన్నత విద్య కోసం రూ.20లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందని చెప్పారు. దేశంలో అనేక చోట్ల కులాలు, మతాల పేరుతో రాజకీయాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో అలాంటి వాటికి చోటుండదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల నిర్వహణలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉంటుందన్నారు. ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఐక్యతతో ఉండి అభివృద్ధిని సాధించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, ప్రతినిధులు జోయెల్, రిచర్డ్, సురేష్ మనోహరన్, ఆశీర్వాదం, పురుషోత్తం, అనిల్ కుమార్, హేమలత, స్రవంతి, క్రిస్టియన్ మైనార్టీ కార్పోరేషన్ ఏఓ సామ్యేల్ తదితరులు పాల్గొన్నారు.