కంటోన్మెంట్, అక్టోబర్ 17: బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసి ప్రతిపక్ష పార్టీల మైండ్ బ్లాక్ అయ్యిందని రాష్ట్ర మంత్రి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగడమే కాకుండా.. ప్రజలకు చెప్పింది చేయగల దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. మంగళవారం కంటోన్మెంట్ బాలంరాయిలోని లీ ప్యాలెస్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రజలకు సాయన్న చేసిన సేవలకు గుర్తింపుగానే ఆయన కుమార్తె లాస్యనందితకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి కల్పించారని, పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కంటోన్మెంట్లో పోటీ చేసేందుకు ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో బెవరేజేస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, తదితరులు పాల్గొన్నారు.