మారేడ్పల్లి, సెప్టెంబర్ 24 : ప్రభుత్వ పాఠశాలను సమగ్ర అభివృద్ధి చేయడంతో పాటు, విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని పశుసంవర్థక మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం వెస్ట్మారేడ్పల్లిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో హిమాన్షు ఆధ్వర్యంలో రూ.2 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్, మరో దాత సహకారంతో రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హెచ్ఆర్డీ సమావేశంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ఇప్పటికే పలు మార్లు సంబంధిత అధికారులతో కలిసి ఈ పాఠశాలను సందర్శించడం జరిగిందన్నారు. పాఠశాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంకల్పించి దాతల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
ఇందులో భాగంగా వ్యాపార వేత్త హిమాన్షు సహకారంతో సమకూర్చిన రూ.2 లక్షల విలువ చేసే ఆర్వో ప్లాంట్, రూ.5 లక్షల వ్యయంతో మరో దాత సమకూచ్చిన డిజిటల్ లైబ్రరీని ప్రారంభించడం జరిగిందన్నారు. పాఠశాలల అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావడం సంతోషకరమని, మరి కొంత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. 65 లారీల చెత్త, మట్టి కుప్పలను పాఠశాల ఆవరణ నుంచి బయటకు తరలించామన్నారు. త్వరలో మరో దాత సుశీల్జైన్ సహకారంతో మరో రూ.4 లక్షల వ్యయంతో టాయిలెట్ల నిర్మాణ పనులు, డైనింగ్ హాల్ నిర్మాణ పనులు చేపట్టనున్నామని చెప్పారు.
ఒక్కొక్క నియోజకవర్గం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.2 కోట్లు నిధులు కేటాయించారని తెలిపారు. ఈ నిధులతో పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్రెడ్డి, హైదరాబాద్ జిల్లా డీఈఓ రోహిణి, మారేడ్పల్లి మండలం విద్యాధికారి యాదయ్య, మారేడ్పల్లి మండల ఉప పర్యావేక్షణ అధికారి ప్రసన్న, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, నాయకులు టీఎన్ శ్రీనివాస్, ఆకుల హరికృష్ణ, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీత మాట్లాడుతూ పాఠశాలలో నెలకొన్న సమస్యలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారని తెలిపారు. విశాలమైన ప్రాంగణం కలిగిన పాఠశాలలో బాలికలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలపై గతంలో మంత్రితో చర్చించామని, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సానుకూలంగా స్పందించి పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని చెప్పడం జరిగిందని తెలిపారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, గతంలో పోల్చితే పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగిందని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.